వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు భారీ ఊరట దక్కిందనే చెప్పాలి. ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ పేరిట అప్పుడెప్పుడో ఆర్జీవీ తీసిన సినిమాపై తాజాగా సీఐడీ నమోదు చేసిన కేసుపై ఏపీ హై కోర్ట్ స్టే విధించింది. ఈ పరిణామం వర్మను ఊపిరిపీల్చుకునేలా చేసింది. ఈ కేసులో వర్మ వినిపించిన వాదనను హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. అంతేకాకుండా వర్మ వాదనను తిరిగి కోర్టు సీఐడీ అధికారులపై అదే ప్రశ్నలను సంధించింది.
2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అప్పటికే వైసీపీకి మద్దతుగా నిలిచిన వర్మ ఆపై టీడీపీని టార్గెట్ చేశారు. మరో అడుగుముందుకేసి ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ అనే టైటిల్తో ఓ సినిమా తీశారు. ఇక ఈ సినిమాపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో ఆయన ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ పేరును ‘అమ్మ రాజ్యంలో కడప రెడ్లు’గా టైటిల్ మార్చి సినిమాను రిలీజ్ చేశారు. అప్పుడే ఈ సినిమాపై పోలీసులకు ఓ ఫిర్యాదు అందింది. అయితే.. అప్పుడు ఆ ఫిర్యాదును పోలీసులు అంతగా పట్టించుకోలేదు. తాజాగా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పాత ఫిర్యాదుపై సీఐడీ కేసు నమోదు చేసింది.
ఈ కేసులో విచారణకు రావాలంటూ వర్మకు బుధవారం సీఐడీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో వర్మ సీఐడీ కేసును హై కోర్టులో సవాలు చేశారు. ఎప్పుడో 2019లో చేసిన ఫిర్యాదుపై ఇప్పుడు కేసు నమోదు చేయడం ఏంటని ఆయన పిటిషన్లో ప్రశ్నించారు. ఈ పిటిషన్ పై గురువారం విచారణ చేపట్టిన హై కోర్టు.. పిటిషన్ వాదనతో ఏకీభవించింది. కేసుపై స్టే విధించింది. అంతేకాకుండా 2019లో ఫిర్యాదు వస్తే ఇప్పుడు కేసు నమోదు చేయడం ఏమిటని కోర్టు కూడా సీఐడీ అధికారులను ప్రశ్నించింది. కోర్టు చేసిన వ్యాఖ్య ద్వారా ఆర్జీవీ వాదనలో న్యాయం ఉంది కదా అని కోర్టు అభిప్రాయపడిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.