Health Tips: ప్రస్తుతం జ్వరాల కాలం నడుస్తోంది. మరోవైపు వాతావరణం మారుతోంది. దీంతో చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా వయసుతో సంబంధం లేకుండా చాలా మంది బాధపడుతున్న సమస్యల్లో గొంతు నొప్పి ఒకటి. గొంతు నొప్పి రావడానికి ఎన్నో కారణాలున్నాయి. గొంతు నొప్పి వచ్చిందంటే ఎంతో ఇబ్బంది పుడుతూ ఉంటాం. గొంతు నొప్పి తగ్గడం కోసం ఎన్నో మాత్రలు వేసుకుంటాం. పెయిన్ కిల్లర్తో పాటు యాంటిబయోటిక్స్ కూడా అవసరానికి మించి మింగేస్తూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో తాత్కాలికంగా ఉపశమనం లభించినా.. ఆ గొంతు నొప్పి నుంచి పూర్తి ఉపశమనం లభించదు. అలాంటి సమయంలో ఇంట్లో ఉండే వస్తువులతో చాలా సింపుల్గా గొంతు నొప్పిని తగ్గించుకోవచ్చు. మన వంటింట్లో ఉండే వస్తువులతో హెర్బల్ టీ చేసుకుని తాగడం ద్వారా.. కేవలం ఒకటి నుంచి రెండు గంటల సమయంలోనే గొంతు నొప్పి నుంచి రిలీఫ్ దొరుకుతుంది. ఒకవేళ గొంతు నొప్పి అధికంగా ఉంటే మాత్రం వైద్యులను సంప్రదించి వారి సలహాలు తీసుకోవడం మంచిది. హెర్బల్ టీలలో కూడా ఎన్నో రకాలున్నాయి. అయితే గొంతు నొప్పికి ఉపశమనం లభించాలంటే హెర్బల్ టీ ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం. హెర్బల్ టీ తాగడానికి ముందు గోరు వెచ్చటి నీటిలో కొంత ఉప్పు వేసి నోటిలో వేసి బాగా పుకిలించాలి. అలా రెండు లేదా మూడు సార్లు పుకిలించిన తర్వాత హెర్బల్ టీ తాగిలే మంచి ఫలితం ఉంటుంది.
హెర్బల్ టీ కోసం నీరు మరిగించి.. ఆ నీటిలో సొంఠి కొద్దిగా వేసుకోవాలి.. ఒక వేళ సొంఠి అందుబాటులో లేకపోతే ఎండిన అల్లం పొడిని కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత పుదీనా, దాల్చిన చెక్క, మిరియాలు పొడిగా చేసుకుని నీటిలో వేసి బాగా మరిగించాలి. కొంత బెల్లం కూడా వేసుకోవాలి. లేకపోతే ఘాటు ఎక్కువుగా ఉండటం వల్ల తాగడం కష్టమవుతుంది. అయితే తగిన మోతాదులో మాత్రమే బెల్లం వేసుకోవాలి. కొన్ని తులసి ఆకులు వేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని బాగా మరిగించిన తర్వాత వడకట్టుకోవాలి. ఆ తర్వాత నిమ్మరసం కొద్దిగా పిండుకుని తాగితే.. కొన్ని గంటల వ్యవధిలోనే గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఒకవేళ మీరు హెర్బల్ టీ తాగిన తర్వాత కూడా గొంతు నొప్పి నుంచి రిలీఫ్ దొరకకపోతే మీరు వెంటనే వైద్య నిపుణుడిని సంప్రదించడం మంచిది. గొంతు నొప్పి విషయంలో నిర్లక్ష్యం చేస్తే అవి కొన్ని సందర్భాల్లో దీర్ఘకాలిక వ్యాధులకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి.
మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..