సీనియర్ నటుడు వీకే నరేష్ మాజీ భార్య రమ్య రఘుపతి ‘మళ్ళీ పెళ్లి’ చిత్రాన్ని థియేటర్లు, OTT లో విడుదల చేయడాన్ని నిలిపివేయాలని కోరుతూ బెంగుళూరులోని సిటీ సివిల్ కోర్టులో వేసిన పిటిషన్ను న్యాయస్థానం తోసిపుచ్చింది.. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయస్థానం, రమ్య రఘుపతి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని మెరిట్లు లేని కారణంగా కొట్టివేస్తూ మంగళవారం తీర్పును వెలువరించింది.
సినిమా విడుదలకు వ్యతిరేకంగా రమ్యరఘుపతి కేసు దాఖలు చేసిన కారణాలను న్యాయస్థానం సమర్థించలేనిదని, న్యాయపరంగా నిలకడగా లేదని కోర్టు పేర్కొంది. బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఆఫ్ ఇండియా సర్టిఫికేట్ ఇచ్చినట్లుగా ఈ సినిమా కంటెంట్ పూర్తిగా కల్పితమని కోర్టు నిర్ధారించింది. సెన్సార్ బోర్డ్ సినిమా కల్పితమని సర్టిఫై చేసిన తర్వాత సినిమా విడుదలను ప్రైవేట్ వ్యక్తి అడ్డుకునే ప్రసక్తే లేదని కోర్టు పేర్కొంది.
కోర్టు తీర్పుతో తెలుగు, కన్నడ భాషల్లో అన్ని OTT ప్లాట్ఫారమ్లు, శాటిలైట్ల ద్వారా ఈ సినిమాని నిర్మాతలు స్వేచ్ఛగా ప్రసారం చేసుకోవచ్చని నిర్మాతలు తెలిపారు.
మరో కేసులో నరేష్, కుటుంబ సభ్యులు, రమ్య రఘుపతిని నరేష్ నానక్రామ్గూడ ఇంట్లోకి ప్రవేశాన్ని నిషేధిస్తూ వేసిన ఇంజక్షన్ దావాను కోర్టు స్వీకరించింది. రమ్య రఘుపతి, నరేష్పై గృహ హింస కేసు, నరేష్, పవిత్ర లోకేష్పై ఇతర కేసు వేసిన విషయం తెలిసిందే. దీని తర్వాత నరేష్, ఆయన కుటుంబ సభ్యులు ..రమ్య రఘుపతిపై గృహ నిషేధం కేసు పెట్టారు. కేసును క్షుణ్ణంగా పరిశీలించిన కోర్టు నరేష్ ఇంట్లోకి రాకుండా నిషేధం విధిస్తూ రమ్యకు ఆదేశాలు జారీ చేసింది.
నరేష్, రమ్య రఘుపతి 6 సంవత్సరాలు కలిసి జీవించ లేదని కోర్టు నిర్ధారించింది. కోర్టు ఇచ్చిన తీర్పు నరేష్, రమ్యల విడాకులకు మార్గం సుగమం చేసింది. సుప్రీంకోర్టు నిబంధన ప్రకారం భార్య భర్తలు 2 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు కలిసి ఉండకపోతే వివాహం రద్దు చేయబడుతుంది. ఇక రమ్య రఘుపతిపై సైబర్ మాల్వేర్, సైబర్ ఎటాక్కు సంబంధించి సైబర్ కోర్టు, సైబర్ సెల్లో సైబర్ క్రైమ్ కేసు పెండింగ్లో ఉంది.