Telangana | తెలంగాణ రైతులకు కేసీఆర్ సర్కారు శుభవార్త తెలిపింది. రాష్ట్రంలో నేటి నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కానున్నాయి. దీంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలుపై సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు, అదనపు కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు, ఎఫ్సీఐ అధికారులతో మంత్రులు హరీశ్రావు, గంగుల కమలాకర్, నిరంజన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. రైతులు పండించిన ధాన్యాన్ని పారదర్శకంగా కొనుగోలు చేసేందుకు అధికారులు కృషి చేయాలని మంత్రులు సూచించారు. జిల్లా స్థాయిలో కార్యాచరణ రూపొందించుకొని కలెక్టర్లు అందరూ సన్నద్ధం కావాలని ఆదేశించారు. రైతులు పండించిన పంటను పూర్తి స్థాయిలో కొనుగోలు చేసేలా అధికారులు పని చేయాలని సూచించారు. ఇందుకోసమే రాష్ట్ర వ్యాప్తంగా 7100 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. కొనుగోళ్లలో ఎలాంటి అవకతవకలు జరగరాదని.. ఎవరైనా అధికారి అవకతవకలకు పాల్పడితే.. కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.