స్వతంత్ర వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో గన్నవరం(Gannavaram) రాజకీయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గన్నవరం వైసీపీ(YCP) టికెట్ కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. టికెట్ నాదే అంటే నాదే అంటూ గొడవ పడుతున్నారు. గన్నవరం గడ్డ.. నా అడ్డా, నేనే పోటీ చేస్తా, ఎవరు అడ్డు వస్తారో చూస్తా అని వైసీపీ నేతల యార్లగడ్డ వెంకట్రావ్( Yarlagadda Venkatarao) అంటున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (MLA Vallabhaneni Vamsi)టార్గెట్ గా యార్లగడ్డ వెంకట్రావ్ మాటల తూటాలు పేల్చారు. ఎవరేమన్నా 2024లో గన్నవరం నుంచి తాను పోటీ చేయడం ఖాయం అంటూ కాన్ఫిడెంట్ గా చెప్పారు. సీఎం జగన్(CM Jagan) తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చెప్పినా, కార్యకర్తలకు తాను ఎక్కడ దూరం అవుతానో అనే భయంతో ఎమ్మెల్సీ పదవి తనకు వద్దని చెప్పినట్లుగా యార్లగడ్డ వెల్లడించారు.
అన్నం తినే వారు ఎవరూ వైసీపీలో చేరరని వంశీ అన్నారు. వంశీతో కలిస్తే నాకు ఎమ్మెల్సీ పదవి వచ్చేది. అయినా కలవలేదు. నాకు అన్యాయం చేయనని సీఎం జగన్ చెప్పారు. ఎవరికీ భయపడేది లేదు. ఎన్ని అవమానాలు ఎదురైనా సీఎంను ఒక్క మాట కూడా అనలేదు. రెండేళ్ల నుంచి సీఎంను కలుద్దామంటే అవకాశం ఇవ్వలేదు. నాకు టిక్కెట్ ఇవ్వాలని సీఎంను అభ్యర్దిస్తున్నా. టిక్కెట్ ఇవ్వకుంటే గన్నవరం ప్రజలు నా భవిష్యత్తును నిర్ణయిస్తారు. గన్నవరం టిక్కెట్ ఇవ్వాలని కార్యకర్తల సమక్షంలో సీఎం జగన్ ను అడుగుతున్నా. గన్నవరంలోనే పోటీ చేస్తా. ఇక్కడే రాజకీయం చేస్తా” అని యార్లగడ్డ వెంకట్రావ్ తేల్చి చెప్పారు.