తెలంగాణలో ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావు అరెస్ట్ అయ్యారు. మంగళవారం రాత్రి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆయన నివాసంలోనే పంజాగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాత్రికిరాత్రి ఆయన్ని హైదరాబాద్కు తరలించారు.
ఎస్ఐబీ లాగర్ రూమ్లో హార్డ్డిస్క్లు ధ్వంసం చేసిన తర్వాత నుంచి ప్రణీత్రావు పక్కా ప్లాన్తో వ్యవహరించినట్లు తెలుస్తోంది. గత నెలలో రాజన్న సిరిసిల్ల జిల్లా డీసీఆర్బీలో రిపోర్ట్ చేశారు. అక్కడ జాయిన్ అయిన రెండు రోజులకే సిక్ లీవ్ పెట్టినట్లు సమాచారం. సస్పెన్షన్కు వారం రోజుల ముందు నుంచే డీసీఆర్బీకి వెళ్లలేదని తెలుస్తోంది. సిరిసిల్ల హెడ్క్వార్టర్ను విడిచి వెళ్లరాదని సస్పెన్షన్ ఉత్తర్వు ల్లో పేర్కొనప్పటికీ ఆయన తప్పించుకుని తిరుగుతున్నట్లు తేలింది. ఈ క్రమంలోనే ప్రణీత్రావు కోసం ఇంటి వద్ద పోలీసులు నిఘా పెట్టారు. మంగళవారం రాత్రి ప్రణీత్ రావు ఇంటికి వచ్చిన విషయం గుర్తించి దాడి చేసి, ఆయనను అరెస్టు చేశారు. ఆయన వద్ద ఉన్న సెల్ ఫోన్లను సీజ్ చేశారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి ప్రణీత్రావును హైదరాబాద్కు తరలించారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో స్టేట్ మెంట్ రికార్డ్ చేసిన అనంతరం నాంపల్లి కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది. ఎస్ఐబీలో కీలక సమాచారాన్ని ధ్వంసం చేశారనే ఆరోపణలపై.. ఎస్ఐబీ అడిషనల్ ఎస్పీ రమేశ్ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ప్రణీత్రావుతో పాటు ఆయనకు సహకరించిన పలువురు అధికారుల్ని సైతం అధికారులు విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నాయి.