సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలో అనిరుధ్ అనే వ్యక్తి హల్చల్ చేశాడు. అధికారులు గందరగోళానికి గురి చేశాడు. తాను సీఎం పేషీ దూతగా పేర్కొంటూ..సీసీఎల్ ప్రత్యేక ప్రతినిధిగా అపాయింట్ చేశారని బిల్డప్ ఇస్తూ కొన్ని రోజులుగా అలజడి సృష్టించాడు. మండల పరిధిలోని ప్రభుత్వ భూముల పూర్తి రికార్డులు తనకు కావాలని..ప్రభుత్వ భూముల చుట్టూ ఫెన్సింగ్ వేసే పూర్తి బాధ్యత తనకే అప్పగించారని రెవెన్యూ అధికారులను తనతో చెరువుల చుట్టూ తిప్పించుకున్నాడు.
అంతేకాకుండా ఇంకో అడుగు ముందుకేసి పటేల్ గూడా గ్రామపంచాయతీ పరిధిలో..జేసీబీల సహాయంతో ఏకంగా ఇళ్లను కూల్చివేయించాడు. గ్రామ పంచాయతీకి సంబంధించిన కార్యదర్శి కాని, ప్రత్యేక అధికారికి కాని తెలియ కుండానే కూల్చివేసేంత సాహసం చేయడం ఏంటని అందరూ విస్మయానికి గురవుతున్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ఫోన్ చేసి మీ పరిధిలో ఇస్తున్న అనుమతుల పూర్తి డాటా తన ముందు ఉంచా లంటూ హుకుం జారీ చేశాడు. ప్రభుత్వ కార్యాలయాలనే కాకుండా..ప్రైవేటు ప్రాపర్టీలోను అనిరుధ్ తలదూర్చి బిల్డింగ్కు తీసుకున్న అనుమతులు, నిర్మాణం ఎంత కడుతున్నారంటూ బిల్డర్లను బెదిరించాడు. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో నిర్మిస్తున్న అపార్ట్మెంట్ల వద్దకు వెళ్లి పర్మిషన్ కాఫీలు ఇవ్వాలంటూ నానా హడావిడి చేశాడు. పటేల్ గూడ ఈవో రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు రంగప్రవేశం చేసిన అమీన్ పూర్ పోలీసులు అనిరుధ్పై ఆరా తీశారు. నకిలీ అధికారి అని తేలడంతో కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకు న్నారు.