లక్షల మంది భక్తులు తరలివస్తుండడంతో మహాకుంభమేళాను మరికొన్ని రోజులు పొడిగించాలని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్.. ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. గతంలో మహా కుంభ్, కుంభమేళా 75 రోజుల పాటు నిర్వహించేవారని.. ఇప్పుడు మాత్రం చాలా తక్కువ రోజులే నిర్వహిస్తున్నారని అన్నారు.
చాలా మంది భక్తులు మహాకుంభమేళాకు రావాలని భావిస్తున్నా.. రాలేకపోతున్నారని అఖిలేశ్ యాదవ్ అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మహాకుంభమేళాను మరికొన్ని రోజులు పొడిగిస్తే భక్తులు ఎక్కువ సంఖ్యలో పుణ్యస్నానాలు చేసే అవకాశం ఉంటుందని అఖిలేశ్ యాదవ్ కోరారు.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాల ప్రకారం.. మహాకుంభమేళాకు వెళ్తున్న రైళ్లలో రద్దీ, దారుల్లో ట్రాఫిక్ జామ్, విపరీతమైన రద్దీ కనిపించింది. ఈ వారం మొదట్లో కుంభమేళాకు వెళ్తున్న రహదారుల్లో 48 గంటల పాటు ట్రాఫిక్ జామ్తో భక్తులు అల్లాడిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాగ్ రాజ్ రైల్వే స్టేషన్ను తాత్కాలికంగా మూసివేయల్సి వచ్చింది.
గత నెలలో మహాకుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో ఎంత మంది మృతి చెందారో సరైన సంఖ్య చెప్పాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని అఖిలేశ్ యాదవ్ డిమాండ్ చేశారు.
మహాకుంభమేళా.. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమం.. జనవరి 13న ప్రారంభమైంది. ఫిబ్రవరి 26తో మహాశివరాత్రి రోజున ముగియనుంది. అక్కడి ప్రభుత్వ లెక్కల ప్రకారం.. శుక్రవారం వరకు 50 కోట్లకు పైగా భక్తులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు చేశారని తెలిపారు. ఇది రష్యా, అమెరికా దేశాలు కలిపితే జనాభా కన్నా అధికమని తెలుస్తోంది.