ఆంధ్రప్రదేశ్లో దోచుకో, పంచుకో, తినుకో పాలన నడుస్తోందన్నారు వైసీపీ అధినేత వై.ఎస్ జగన్. చంద్రబాబు సర్కారు తీసుకొచ్చిన నూతన మద్యం, ఇసుక పాలసీలో అంతా అవినీతేనని ఆరోపించారు. ఎన్నికలప్పుడు ప్రజల ఆశలతో చెలగాటం ఆడి.. తప్పుడు ప్రచారాలు చేశారని.. ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని ఎద్దేవా చేశారు. పవర్లోకి వచ్చాక క్లిష్ట పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నారంటూ విమర్శించారు వై.ఎస్ జగన్.
మద్యంలోనూ మాఫియాను నడుపుతున్నారంటూ ఏపీ ప్రభుత్వంపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు జగన్. రాష్ట్రంలో 20 డిస్టిలరీలు ఉంటే.. అందులో 14 డిస్టిలరీస్కు లైసెన్స్ ఇచ్చిందే చంద్రబాబని.. తమ హయాంలో ఒక్క పర్మీషన్ కూడా ఇవ్వలేదన్నారు. బూంబూం, ప్రెసిడెంట్ మెడల్, 999 పవర్ స్టార్ లాంటి బ్రాండ్లన్నీ చంద్రబాబు తెచ్చినవేనన్నారు. వైసీపీ హయాంలో బెల్టు షాపులను, పర్మిట్ రూమ్లను రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు జగన్. స్కిల్ స్కాం విషయంపైనా స్పందించారు వైసీపీ అధినేత. ఈ కేసులో టీడీపీ అధినేతకు ఈడీ ఎక్కడ క్లీన్ చిట్ ఇచ్చిందని సూటిగా ప్రశ్నించారు జగన్.