జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో కాంగ్రెస్, బీజేపీ కార్పొరేటర్ల మధ్య చోటుచేసుకున్న ఘర్షణపై మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. ప్రజా సమస్యలపై నిలదీస్తుంటే అకారణంగా తమ మహిళా కార్పొరేటర్లపై దౌర్జన్యం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయాలు, పదవులపై ఉన్న ధ్యాస ప్రజా సమస్యల పరిష్కారంపై లేదని మండిపడ్డారు. దీనికి ఇవాళ కౌన్సిల్లో జరిగిన ఘటనే నిదర్శనమని చెప్పారు. గత బీఆర్ఎస్ హయాంలో జరిగినట్లుగానే ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని కాంగ్రెస్ తుంగలోకి తొక్కుతోందని విమర్శించారు. గతంలో అధికారంలో ఉన్న పార్టీ కూడా ఇదే తరహాలో ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేసి ప్రజాగ్రహానికి గురైందని, కాంగ్రెస్ కూడా ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.