స్వతంత్ర వెబ్ డెస్క్:తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. ఈ ఏడాది చివరిలో జరగనున్న ఎన్నికల కోసం కసరత్తు మొదలు పెట్టింది ఎన్నికల సంఘం. ఈ క్రమంలో కొత్త ఓటర్లు నమోదు ప్రక్రియను ప్రారంభించింది. దీనిలో భాగంగా 2023 అక్టోబర్ 1వ తేదీ నాటికి 18సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారు కొత్తగా ఓటరు కార్డును నమోదు చేసుకోవడానికి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. అర్హత కలిగిన వారు బూత్ లెవల్ అధికారుల వద్ద దరఖాస్తు పూర్తి చేయాలని ఎన్నికల సంఘం అధికారులు సూచించారు.
అదే విధంగా జూన్ 24 నుంచి జులై 24 తేదీ వరకు ఓటరు కార్డులపై ఫోటోల మార్పిడి, పోలింగ్ కేంద్రాల బౌండరీల నిర్ధారణ చేయనున్నారు. జులై 25 నుంచి 31వ తేదీ వరకు నమూనా ఓటరు జాబితా రూపొందించనున్నారు. ఆ తర్వాత ఆగస్టు 2వ తేదీన ఓటరు ముసాయిదా జాబితాను విడుదల చేయనుంది. ఆగస్టు 31వ తేదీ వరకు ముసాయిదా జాబితాపై అభ్యంతరాలను స్వీకరించనుంది. ముసాయిదా జాబితాపై అందిన ఫిర్యాదులను సెప్టెంబర్ 22వ తేదీ వరకు పరిష్కరించనున్నారు. ఓటర్ల తుది జాబితా విడుదల కోసం సెప్టెంబర్ 29వ తేదీ వరకు ఎలక్షన్ కమిషన్ అనుమతి తీసుకుంటారు. కమిషన్ అనుమతి లభించగానే అక్టోబర్ 4వ తేదీన ఓటర్ల తుది జాబితా విడుదల కానుంది.