సోషల్ మీడియా ప్రధాన సాధనంగా ఎన్నికల ప్రచారం తీరు మారిపోయింది. సాంకేతికతను ఎంత వాడాలో అంత వాడుతున్నారు పొలిటికల్ లీడర్లు. ఎప్పటికప్పుడు ట్రెండ్ మారుస్తూ ఓటర్లను ఆకర్షిస్తు న్నారు. పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ప్రచారంతో ఓట్లు రాబట్టే పనిలో పడ్డారు. మరి ఈ కొత్త రకం ప్రచారం ఓటర్ల మనసు మార్చేస్తుందా..? ఓట్ల వర్షం కురిపిస్తుందా..?
ఎన్నికల రణరంగంలో ప్రచారం పర్వం ప్రధానమైంది. ప్రజలకు చేరువ కావాలన్నా, భారీగా ఓట్లు రాబట్టాలన్నా ప్రచారం అత్యంత కీలక ఘట్టం. ఎన్నికల బరిలో నిలిచిన ప్రత్యర్థి ఆట కట్టించాలంటే వాక్ చాతుర్యం ఎంతో ముఖ్యమో.. మనం చెప్పాలనుకున్న అంశం అందరికీ చేరడం కూడా అంతే ముఖ్యం. ఇందులో భాగంగానే పబ్లిక్ మీటింగ్స్తోపాటు, ఇంటింటి ప్రచారాలు, కరపత్రాలు, పోస్టర్లు, పేపర్ యాడ్లు ద్వారా ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే, గత దశాబ్ధకాలం నుంచి జనాల్లో ఫోన్ వాడకం ఎక్కువ కావడంతో ప్రచారంలో సోషల్ మీడియా కూడా భాగమైంది. ఇందుకోసం రాజకీయ పార్టీలు ప్రత్యేక వింగ్ను కూడా ఏర్పాటు చేసుకుంటున్నాయి అంటే సోషల్ మీడియా పాత్ర ఎంత ఉందో అర్థమైపోతుంది. తాము చేసే పొలిటికల్ కార్యక్రమాలే కాదు. ప్రత్యర్థుల వైఫల్యాలను ఎప్పటికప్పుడు నెట్టింట ఎండగట్టడంతో సోషల్ మీడియా రాజకీయ కార్యక్రమాల్లో ఓ భాగమైపోయింది.
ఇక ప్రస్తుతం మరో కొత్త టెక్నాలజి ప్రచార పర్వంలో భాగమైంది. ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు మాయ చేయడంలో ఈ టెక్నాలజీ దిట్ట. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఏఐ ద్వారా ఎప్పుడో మరణించిన వారే మనల్ని ఓట్లు అడగటం ఆశ్యర్యాన్ని కలిగిస్తుంది. అదొక్కటే కాదు.. MIM నేత అసదుద్దీన్ ఒవైసీతో భక్తి గీతాలు కూడా పాడించగలదు. అంతటి టెక్నాలజీ గల ఏఐ ఎన్నికల పర్వంలో భాగమైంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఫైట్ క్యాంపెయిన్లో ఈ ప్రచారం జోరందుకుంది. సోషల్ మీడియా ద్వారా ఓటర్లను చేరుకోవడానికి రాజకీయ పార్టీలు AIనిఉపయోగిస్తున్నాయి. గత ఏడాది నుంచే కాంగ్రెస్, బీజేపీ లు ఈ టెక్నాలజీని వాడుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ ప్రసంగాలను ఎనిమిది ప్రాంతీయ భాషల్లోకి అనువదించడానికి బీజేపీ AIని ఉపయోగించింది. ఇటీవల తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ రోబోతో వినూత్నంగా ఎన్నికల ప్రచారం చేయడం వైరల్గా మారింది. అలాగే రాహుల్ గాంధీ ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నట్టుగా ఓ వీడియో కూడా నెట్టింట తెగ చక్కర్లు కొట్టింది. అయితే ఈ ప్రచారంలో తమ పార్టీ గొప్పదనాన్ని చెప్పుకుంటూ తాము బరిలో నిలిపిన అభ్యర్థికి ఓటు వేయాల్సిందిగా చెప్పడమే కాదు.. పరత్యర్థిపై తప్పుడు ప్రచారాలు కూడా జరిగే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోరు సాగుతుండగా తెలంగాణలో ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో లోక్సభ ఎన్నికలు మాత్రమే జరగనున్నాయి. అయితే, భానుడి ప్రతాపంతో తెలుగు రాష్ట్రాలు నిప్పుల కొలిమిలా మండిపోతున్నాయి. 103 ఏళ్ల రికార్డ్ను బద్దలు కొడుతూ 46 డిగ్రీలతో సూరీడు విరుచుకుపడుతున్నాడు. దీంతో భానుడి భగభగ ఎన్నికల క్యాంపెయిన్పై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో 11 తర్వాత నుంచి సాయంత్రం 6 గంటల వరకూ బ్రేక్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉదయం, సాయంత్ర వేళల్లో మాత్రమే ప్రచారం జోరుగా సాగుతోంది. అందుకే అగ్రనేతల భారీ బహిరంగ సభలు, కార్నర్ మీటింగ్లు, రోడ్ షోలు సాయంత్రం నిర్వహించేలా ప్రణాళికలు చేసుకుని.. ఆ దిశగానే ముందుకు సాగుతున్నారు. ఇలా భానుడు విలయతాండవం చేస్తున్న వేళ ఏఐ ప్రచారానికి ప్రాధాన్యతనిస్తున్నారు పార్టీ లీడర్లు. ప్రచార సాధనంగా వాడుకుని ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. మరి ఏఐ ఏమేర ప్రజల మనసు దోచుకుంటుంది..? ఓటర్లకు ఎంత దగ్గరైంది..? ఏ మేర ప్రభావం చూపుతోంది అన్నది తెలియాలంటే ఎన్నికల ఫలితాల వరకూ వేచి చూడాల్సిందే.


