స్వతంత్ర వెబ్ డెస్క్: వారం రోజుల్లో డీఎస్సీ(Dsc) నోటిఫికేషన్ విడుదల చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) కు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి(Komatireddy) లేఖ రాశారు. అసెంబ్లీలో ఇచ్చిన హామీ మేరకు 13 వేల 500 పోస్టులకు నోటిఫికేషన్ ను వారంలో వేయాలని కోరారు. లేదంటే కాంగ్రెస్ పార్టీ(Congress) ఆధ్వర్యంలో ప్రగతిభవన్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఏం జరుగుతోందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు.
నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో సాగిన ఉద్యమ ఆకాంక్షలు ఎక్కడ నెరవేరాయన్నారు. కాంగ్రెస్ హయాంలో మొదలుపెట్టిన ప్రాజెక్టులను అక్కడే వదిలేశారని, మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మర్చారని ఆవేదన వ్యక్తం చేశారు. అనవసర ఆర్భాటాలకు పోయి ప్రజాధనం వృథా చేస్తున్నారని ఆరోపించారు. తొమ్మిదిన్నరేళ్లలో తెలంగాణలో ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని..? భర్తీ చేసిన ఉద్యోగాలు ఎన్ని..? అని ప్రశ్నించారు. ముఖ్యంగా టీచర్ పోస్టుల అంశంలో పూర్తి నిర్లక్ష్యం వహించారని చెప్పారు.


