జనసేన కేంద్ర కార్యాలయంపై డ్రోన్ ఎగరడం ఆ పార్టీలో కలకలం సృష్టించింది. ఈ ఘటనపై తాజాగా పోలీసులు ఇచ్చిన వివరణ మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. జనసేన కార్యాలయంపై డ్రోన్ ఎగరడాన్ని ఆ పార్టీ సీరియస్గా తీసుకుంది. అసలే పవన్కల్యాణ్ భద్రతపై జనసేన భయాందోళనలో వుంది. పవన్ కళ్యాణ్ పార్వతీపురం మన్యం జిల్లా పర్యటన సమయంలో నకిలీ ఐపీఎస్ ప్రత్యక్షమవ్వడం, ఇప్పుడు డ్రోన్ ఎగరడం .. ఆ పార్టీ శ్రేణుల్లో ఆందోళనను మరింత పెంచింది.
గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంపై ఈ నెల 18న డ్రోన్ ఎగరడాన్ని గుర్తించారు. దీనిపై జనసేన సీరియస్గా స్పందించింది. వెంటనే దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఈనెల 20న లా అండ్ ఆర్డర్ అదనపు ఎస్పీ రవికుమార్ ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. దీని వెనుక ప్రభుత్వం ఉందని తేల్చేశారు. ఆ డ్రోన్ ఏపీ ఫైబర్నెట్ సంస్థదని వెల్లడించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే డ్రోన్ సర్వే నిర్వహిస్తోందని చెప్పారు. మంగళగిరి పరిసర ప్రాంతాల్లోని రోడ్లు, ఆక్రమణలు, ట్రాఫిక్, శానిటేషన్ తదితర అంశాలపై డ్రోన్ సర్వేను నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు. జనసేన కార్యాలయం మాత్రమే కాదు.. టీడీపీ ఆఫీసు, ఇతర భవనాలపైనా కూడా డ్రోన్ ద్వారా సర్వే చేపట్టినట్టు వెల్లడించారు. అయితే దీనిపై ముందుగా ఆయా ఆఫీసులకు సమాచారమిచ్చి ఉంటే అపోహలు వచ్చేవి కావని.. అయితే ఆయా సంస్థ వర్గాలు పోలీసులకు సమాచారం ఇచ్చామని అంటున్నాయని చెప్పారు.
ఇంత వరకు ఆయన వివరణ బాగానే ఉన్నా.. ఇక్కడే జనసేన కేడర్లో అనుమానాలు తలెత్తాయి. ఇవే జనంలోనూ అనుమానాలను పెంచేశాయి. పార్టీ ఆఫీసుపై డ్రోన్ ఎగిరిందని.. దీనిపై విచారణ చేయాలని జనసేన కేడర్ కోరినప్పుడు ఏపీ ఫైబర్ నెట్ ఎందుకు ముందుకు రాలేదు?. ఆ డ్రోన్ ఎగురవేసింది తామేనని.. సర్వే కోసమే వినియోగించామని ఎందుకు ప్రకటించలేదు? ఇక ఈ ఘటనపై లోతుగా విచారణ చేయాల్సిన అవసరం ఏముంది?.. జనసేన కార్యాలయంపై డ్రోన్ను ఎగురవేసి ఎలాంటి ఇన్ఫర్మేషన్ సేకరించాలని అనుకున్నారు?.. ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలనే జనసేన కేడర్ లేవనెత్తుతున్నారు.
దీని వెనుక తెలుగు తమ్ముళ్ల హస్తమే ఉందా?.. ఏదో చేయాలని అనుకుని, ఇప్పుడు రెడ్హ్యాండెడ్గా దొరికిపోవడంతో సర్వే కోసం అంటూ మాట మార్చారా?.. అని జనసేన నేతలు అనుమానిస్తున్నారు. ప్రభుత్వం చెబుతున్నది నిజమే అయితే.. ఇప్పటి దాకా ఎందుకు ఆగాలి.. విచరణకు ముందే ఈ విషయాన్ని ప్రకటించి ఉండొచ్చు కదా.. అనేది జనసేన వాదన. మిత్రపక్షమైన తమపై టీడీపీ నిఘా ఉంచిందని జనసేన నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.