కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు విజయ డైరీ పేరుతో తమ పాల ప్యాకెట్లను విక్రయిస్తున్నారని..తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి అన్నారు. అలాంటి పాలను కొనుగోలు చేయవద్దని ఆయన పేర్కొన్నారు. లాలాపేట్లోని విజయ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో డైరీ ఎండీ చంద్రశేఖర్ రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. ప్రజలు విజయ తెలంగాణ అని బ్రాండ్ ఉంటేనే పాలను కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా తెలంగాణ నకిలీ పాలను డిస్ట్రిబ్యూటర్స్ వెండర్స్ కొనుగోలు చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే తాము కోర్టును ఆశ్రయించడం జరిగిందన్నారు. ఇలాంటి నకిలీ విజయ పాలతో వచ్చిన ఉత్పత్తులను కొనుగోలు చేయవద్దని సూచించారు.