టార్గెట్ 2024 అంటున్నాయి ఏపీలోని విపక్షాలు. 2019లో జరిగిన పొరబాట్లను మళ్లీ రిపీట్ చేయకుండా.. ఇంకా చెప్పాలంటే ఒంటరిగా పోటీ చేస్తే కష్టమన్న భావనతో ఉమ్మడిగా అధికార వైసీపీని ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యాయి టీడీపీ-జనసేన పార్టీలు. అయితే.. తమతో బీజేపీ కూడా కలిసి వస్తుందని భావిస్తున్నాయి. ఈ దిశగా తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు టీడీపీ-జనసేన నేతలు. అంతేకాదు.. జగన్ నుంచి రాష్ట్రాన్ని కాపాడడమే తమ లక్ష్యమని చెబుతున్న ఇరు పార్టీల అధినేతలు.. ఇప్పుడు ఉమ్మడి మేనిఫెస్టోపై దృష్టి సారించారు.
ఒక్కొక్కరుగా కాదు… కలిసి కట్టుగా ముందుకెళితేనే వైసీపీని ఓడించగలం అంటున్నాయి ఏపీలోని విపక్ష పార్టీలు. ఆ దిశగానే కార్యాచరణ రూపొందించి.. అందుకు తగినట్లుగానే అడుగులు వేస్తున్నాయి టీడీపీ-జనసేన పార్టీలు. 2019లో ఈ రెండు పార్టీలు ఒంటరిగా పోటీ చేయడం.. ఎన్నికల్లో దారుణమైన ఓటమి చవిచూడడంతో మరోసారి విడివిడిగా పోటీ చేయాలన్న ఆలోచనే చేయలేదు విపక్షాలు. దీంతో.. 2024 ఎన్నికల్లో కలిసి కట్టుగా పోటీ చేయను న్నట్లు ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టైన సమయం లో… సంఘీభావం తెలిపేందుకు వచ్చిన పవన్.. అక్కడ్నుంచే పొత్తులపై కీలక ప్రకటన చేశారు.
అప్పట్నుంచి ఉమ్మడి కార్యాచరణపై దృష్టి సారించిన ఇరు పార్టీల అధినేతలు.. రానున్న ఎన్నికల కోసం ఉమ్మడిగా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి.. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహాలు, ప్రచారం… ఇలా పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఇందు కోసం పలుమార్లు సమావేశమైన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్.. ఇటీవలె రెండు పార్టీల తరఫున పోటీ చేయబోయే అభ్యర్థులను సైతం ప్రకటించారు. అయితే… పొత్తులో భాగంగా ఒక పార్టీ ఆశించిన సీటు మరో పార్టీకి దక్కడంతో అసంతృప్తులు భగ్గుమంటున్నాయి. అయితే.. రాష్ట్ర భవిష్యత్ కోసం.. వైసీపీని ఇంటికి పంపిచడం కోసం కొన్ని త్యాగాలు తప్పవంటూ ఇరువురు అధినేతలు నేతలకు, కేడర్కూ నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
ఇప్పటికే తొలి జాబితా విడుదల చేసిన ఇరు పార్టీలు, అతి త్వరలోనే మరో లిస్ట్ రిలీజ్ చేయనున్నాయి. ఓవైపు ఆ కసరత్తులు చేస్తూనే.. బీజేపీతోనూ పొత్తు వ్యవహారంపై వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి ఇరు పార్టీలు. వైసీపీని గద్దె దించాల్సిన ఆవశ్యకతను ఇప్పటికే ఢిల్లీ పెద్దలతో సమావేశమై వారి దృష్టికి తీసుకెళ్లారు టీడీపీ అధినేత చంద్రబాబు. అయితే.. కమలం నేతలు ఇంకా దోస్తీపై మాట్లాడకపోయినా పరిస్థితులు సానుకూలంగానే ఉన్నాయని చెబుతున్నారు టీడీపీ జనసేన నేతలు. మళ్లీ మరోసారి హస్తిన పెద్దలతో సమావేశమయ్యేందుకు రెడీ అయ్యారు. ఇలా పొత్తు రాజకీయం ఓవైపు చేస్తూనే.. ఉమ్మడి ప్రచారం నిర్వహిస్తున్నాయి టీడీపీ-జనసేన పార్టీలు. ఇందులో భాగంగా ఇప్పటికే మొదటి సభను తాడేపల్లిగూడెంలో జెండా పేరుతో నిర్వహించారు. ఈ వేదికపై నుంచే కలిసి కట్టుగా వైసీపీపై సమరభేరి మోగించాయి విపక్ష పార్టీలు. వైసీపీ పాలనలో ఏ ఒక్క వర్గానికి న్యాయం జరగలేదని ఈ సందర్భంగా ఆరోపించారు టీడీపీ అధినేత చంద్రబాబు. జగన్ కుట్రలు, కుతంత్రాలకు, విధ్వంసాలకు పుల్స్టాప్ పెడతామని అన్నారు. వైసీపీ ఒక చీటింగ్ టీమ్ అంటూ సెటైర్లు వేశారు టీడీపీ అధినేత.
ఇక, జనసేన అధినేత పవన్ కల్యాణ్.. వైసీపీ ప్రభుత్వంపై మరింత ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సిద్ధం సిద్ధం అంటున్న జగన్కు యుద్ధం ఇస్తామంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు..ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ను అధికారంలోకి రాకుండా చూస్తానంటూ సవాలు విసిరారు పవన్. మరోవైపు.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సైతం శంఖారావం పేరుతో సభలు నిర్వహిస్తూ ప్రచారం చేస్తున్నారు. అయితే.. త్వరలోనే ఎన్నికల షెడ్యూలు రానున్న నేపథ్యంలో.. ఉమ్మడి మేనిఫెస్టోపై ఇప్పుడు దృష్టి సారించారు ఇరు పార్టీల నేతలు. ఇప్పటికే టీడీపీ సూపర్ సిక్స్ పేరుతో తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్నది పొత్తులకు ముందుగానే ప్రకటించింది. అయితే..జనసేనతో పొత్తు తర్వాత ఆ పార్టీ హామీలను కొన్నింటిని పొందు పరిచింది. ఇప్పుడు పూర్తిస్థాయిలో ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు నేతలు. వైసీపీ మేనిఫెస్టోలో పొందు పరిచే అంశాలకు ఏ మాత్రం తగ్గకుండా తమ హామీలు ఉండాలా చూసుకునే ప్రయత్నం చేస్తున్నాయి రెండు పార్టీలు. ఈనెల 17న చిలకలూరి పేటలో జరిగే బహిరంగ సభ వేదికగా ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు ప్రకటిం చారు టీడీపీ, జనసేన నేతలు. ఎన్నికల వ్యూహాలే కాదు..అందుబాటులో ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకో వాలని భావిస్తున్నాయి రెండు పార్టీలు.