ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి బిగ్ షాక్ తగిలింది. ఆయనపై అనర్హత వేటు పడింది. ఇటీవల జంగా వైసీపీని వీడి టీడీపీలో చేరారు. అయితే, ఆయనపై అనర్హత వేటు వేయాలని శాసనమండలి చైర్మన్ కు వైసీపీ ఫిర్యాదు చేసింది. జంగా పార్టీ ఫిరాయింపు కారణంగా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాలని వైసీపీ కోరింది. ఈ మేరకు వైసీపీ విప్ లేళ్ల అప్పిరెడ్డి అసెంబ్లీ సెక్రటరీ జనరల్ కు ఫిర్యాదు చేశారు. వైసీపీ నేతల ఫిర్యాదుపై శాసన మండలి చైర్మన్ మోషేనురాజు జంగా నుంచి పలు సార్లు వివరణ తీసుకున్నారు. జంగా ఇచ్చిన వివరణ ఆధారంగా ఎమ్మెల్సీగా కృష్ణమూర్తి అనర్హుడని పేర్కొంటూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. జంగా కృష్ణమూర్తి గతంలో పల్నాడు జిల్లా గురజాల ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ తరువాత ఆయన్ని వైసీపీ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీని చేసింది. వైసీపీలో ఉన్న సమయంలో విప్ గానూ జంగా పనిచేశారు. అయితే, ఎన్నికల ముందు వైసీపీని వీడి టీడీపీలో చేరారు.