వరంగల్లో వర్గపోరు హైకమాండ్కు తలనొప్పిగా మారింది. బుజ్జగింపు పర్వం నడుస్తున్నా ఆశావహుల ఆగ్రహం, అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతూనే ఉన్నాయి. ఇంతకీ ఎందుకా అసంతృప్తి..? కాకతీయుల కోటాలో ఏం జరుగు తోంది..?
పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీకి, అసంతృప్తుల సెగ కలవరపెడుతోంది. బుజ్జగింపుల తో అలక వీడిన ఆశావహులు. ఆ తర్వాత పార్టీలో సముచిత స్థానం లేదంటూ కన్నెర్ర చేస్తున్నారు. ఇటీవల రేవంత్ పర్యటనలో ప్రాధాన్యత ఇవ్వలేదని గుర్రుగా ఉన్నారు. మరోపక్క ఇతర పార్టీల నుంచి వలస నేతలతో పొసగక వర్గపోరు తారా స్థాయికి చేరడంతో మరింత రగడ రాజుకుంటోంది.
ఈసారి జరిగే పార్లమెంట్ పోరులో తెలంగాణ ప్రజానీకమంతా వరంగల్ వైపే చూస్తోంది. దేశ రాజకీయా ల్లోనే కొత్త అధ్యయనానికి తెరలేపారు కడియం శ్రీహరి, ఆయన కూతురు కావ్య. బీఆర్ఎస్లో ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన 20 రోజుల తర్వాత తండ్రీ కూతూరు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకుని, ఆ పార్టీలోనూ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగి కొత్త అధ్యయానానికి తెర లేపారు. దీంతో అప్పటి వరకూ పార్టీని నమ్ముకుని టికెట్పై ఆశలు పెట్టుకున్న దళిత నేతలు హైకమాండ్ తీరుపై అలక బూనా రు. అయితే, వారిని తొలుత అధిష్టానం బుజ్జగించినప్పటికీ ఆ తర్వాత రోజుల్లో ఇటు అభ్యర్థి కానీ, పార్టీ ఇన్చార్జ్లు కానీ ప్రధాన కార్యక్రమాల్లో సముచిత స్థానం కల్పించకపోవడంతో సీన్ మళ్లీ మొదటికొచ్చింది. తీవ్ర అసంతృప్తితో ఆగ్రహంగా ఉన్నారు. వీరిలో దొమ్మటి సాంబయ్య, రాగమల్ల పరమేశ్వర్, జన్ను పరంజ్యోతి, సింగపురం ఇందిరా, తదితరులు ఉన్నారు. వీరంతా దళితుల్లో మెజారిటీ సామాజిక వర్గానికి చెందిన మాదిగ వర్గ నేతలు.
అసలే ఆగ్రహంగా ఉన్న నేతలకు సీఎం రేవంత్రెడ్డి ప్రసంగంతో పుండు మీద కారం చల్లినట్టయింది. కడియం శ్రీహరి రాకను ఇప్పటికే వరంగల్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి తరుణంలో సీఎం ప్రసంగం అసంతృప్తులను బుజ్జగించేలా ఉంటుందని ఆశించారు. కానీ అందుకు భిన్నంగా కడియాన్ని తానే ఆహ్వానించానని, ఆయన వద్దకు పార్టీ పెద్దలను తానే పంపానని చెప్పుకొచ్చారు రేవంత్. అంతేకాదువిద్యావంతుడు, అనుభవశాలి అంటూ కడియంపై ప్రశంసల జల్లు కురిపించారు. కడియం రాకను జీర్ణించుకోలేక, టికెట్ చేజారిపోయిన బాధని దిగమింగుకోలేక ఉన్న నేతలకు రేవంత్ వ్యాఖ్యలు మరింత మంట పుట్టించాయి. ఇన్నాళ్లూ పార్టీ కోసం కష్టపడితే మా కష్టార్జితాన్ని గుర్తించడం లేదని అగ్గి మీద గుగ్గిలంలా ఫైర్ అవుతున్నారు. అయితే, ఈ ఎఫెక్ట్ ప్రచారంపై పడుతోంది.
ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీలు ప్రచారంలో స్పీడ్ పెంచాయి. నియోజకవర్గాల వారిగా, మండలాల వారీగా సన్నాక సమావేశాలు నిర్వహించుకొని క్యాడర్ తో ఇంటింటి ప్రచారంతో దూసుకుపోతున్నారు కమల నాథులు. అయితే, వర్గపోరుతో కాంగ్రెస్లో మా జోస్ కనిపించడం లేదు. అసంతృప్తి నేతలతో ఇంకా బుజ్జగించే పనుల్లోనే ఉంది. జిల్లా మంత్రి కొండా సురేఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, జిల్లా నేతలను సమన్వయం చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఆ చర్చలు ఫలించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. సీనియర్ నేతలను కలుపుకుని ముందుకు వెళ్తే తప్ప విజయం లభించదన్న చర్చ సాగుతోంది. మరి ఎన్నికలకు సమయం దగ్గర పడటంతో ఇకనైనా అసంతృప్తులు అలక వీడుతారా..? కొత్త, పాత నేతలు సమన్వయంతో కలిసి పని చేస్తారా.? లేదంటే కడియం కావ్య అందివచ్చిన అవకాశాన్ని చేజార్చుకుంటారా అన్నది వేచి చూడాలి.


