స్వతంత్ర వెబ్ డెస్క్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మూడో సంవత్సరం చదువుతున్న గోలి రక్షిత అనే విద్యార్థిని పట్టణంలో ఎస్సీ ఉమెన్స్ హాస్టల్లో బలవన్మరణానికి పాల్పడటం కలకలం రేపింది. మెండోరా మండల కేంద్రానికి చెందిన రక్షిత.. ఆర్మూర్ పట్టణంలోని నరేంద్ర డిగ్రీ కళాశాలలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో రక్షిత.. పట్టణంలోని ఎస్సీ ఉమెన్స్ హాస్టల్లో ఉంటూ క్లాసులకు హాజరవుతోంది.
ఎప్పటిలాగే కాలేజ్ నుంచి తిరిగొచ్చిన రక్షిత.. రాత్రి అందరితో కలిసి భోజనం చేయకుండా ఒంటరిగా తన గదిలోకి వెళ్లింది. స్నేహితులు అడగ్గా.. తర్వాత తింటానని చెప్పింది. గదిలోకి వెళ్లి సుమారు అరగంట పూర్తవుతున్నా రక్షిత బయటకు రాకపోవడంతో ఆమెకు ఫోన్ చేశారు. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో వార్డెన్ ఫర్జానా బేగం కిటికీలోంచి చూడగా ఫ్యాన్కు చున్నీతో ఉరివేసుకున్నట్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమై గది తలుపులు పగలగొట్టి పోలీసులు, వసతి గృహ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. రక్షితను పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉందంటూ అక్కడి వైద్యులు ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. ప్రభుత్వాసుపత్రిలో పరీక్షించిన వైద్యులు.. రక్షిత మృతిచెందినట్లు చెప్పారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. విద్యార్థిని మృతికి గల కారణాలు తెలియరాలేదు. పోస్టు మార్టం నిమిత్తం.. మృతదేహాన్ని ఆర్మూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే, విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. కాగా.. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. రక్షిత మరణానికి కారణం ఏంటీ..? ఎందుకిలా చేసుకుని ఉంటుంది.. ఆమె ఫ్రెండ్స్ ను ఆరా తీస్తున్నారు పోలీసులు.