ఇజ్రాయెల్ దాడులతో గాజాలో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. ప్రజల పరిస్థితి మరింత దయ నీయంగా మారింది. మానవతా సాయం కోసం ఎదురు చూస్తున్న అమాయకులపై ఐడీఎఫ్ కాల్పులు జరపడం యావత్ ప్రపంచాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆకలితో అల్లాడుతున్న గాజావాసులను ఆదుకునేందుకు అమెరికా ముందుకొచ్చింది. విమానాల ద్వారా ఆహార ప్యాకెట్లను గాజాలోకి జారవిడుస్తా మని అధ్యక్షుడు బైడెన్ మీడియాకు వెల్లడించారు.
ఈ క్లిష్ట పరిస్థితుల్లో గాజాకు మానవతా సాయం ఎంతో అవసరమని బైడెన్ అన్నారు. అందించేం దుకు అమెరికా సిద్ధంగా ఉందని చెప్పారు. సముద్ర మార్గాన పెద్ద మొత్తంలో సహాయం అందించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ‘రెడీ టూ మీల్స్’ ప్యాకెట్లను మిలటరీ విమానాల ద్వారా ఎయిర్డ్రాప్ చేయనుంది. ఈ ఆహార పంపిణీ నిరంతర ప్రక్రియ అని వైట్హౌస్ ప్రతినిధి ఒకరు తెలిపారు. జోర్డాన్, ఫ్రాన్స్ సహా ఇతర దేశాలు ఇప్పటికే గాజాలోకి ఆహార పొట్లాలను జారవిడిచాయి. మానవతా సాయం ఫలాలు అందరికీ అందాలంటే గాజా-ఈజిప్ట్ సరిహద్దులోని రఫా చెక్పోస్టు తెరుచుకుంటేనే అది జరుగు తుందని.. లేదంటే ఈ చర్య అంతగా ప్రభావం చూపకపోవచ్చని మరొక అమెరికా అధికారి అభిప్రాయం వ్యక్తం చేశారు.
నిన్న తెల్లవారుజామున మానవతా సాయం కోరుతూ ట్రక్కుల వద్ద గుమిగూడి ఉన్న వారిపై ఇజ్రాయెల్ విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. ఎంతో మంది తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు చిన్నారులు తీవ్ర పోషకాహారం లోపంతో బాధపడుతున్నారని ఐక్యరాజ్యసమితి అందోళన వ్యక్తం చేస్తోంది. ఆహార కొరత ఏర్పడి రోజుల తరబడి పస్తులు ఉంటున్నారు. ఆకలికి తాళలేక పశువుల దాణానే ఆహారంగా తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొనడం బాధాకరం. ఈ సంక్షో భాన్ని నివారించాలంటే రోజుకు 500 ఫుడ్ ట్రక్కులు గాజాలోకి ప్రవేశించాల్సి ఉంటుంది. కానీ, జనవరిలో రోజుకు 150.. ఫిబ్రవరిలో 97 ట్రక్కులు మాత్రమే గాజాలోకి ప్రవేశించాయి.


