స్వతంత్ర వెబ్ డెస్క్: దేశంలో మేజర్ డేటా లీక్ వెలుగు చూసింది. కొవిడ్ వ్యాక్సినేషన్కు ఉద్దేశించిన కొవిన్ పోర్టల్లోని సున్నితమైన సమాచారం బయటకొచ్చింది. వ్యక్తుల పేర్లు, ఫోన్ నంబర్లు, ఆధార్, పాన్ తదితర వివరాలు టెలిగ్రామ్లో ప్రత్యక్షమయ్యాయి. ఎవరైనా ఈ డేటాను యాక్సెస్ చేసే విధంగా అందుబాటులోకి రావడం కలకలం రేపుతోంది. కొవిన్ వ్యాక్సిన్ వేయించుకోవాలంటే ముందుగా సమాచారాన్ని సేకరించిన విషయం తెలిసిందే. ఆధార్ వివరాలు, ఫోన్ నెంబర్లతో పాటు ఏయే తేదీల్లో ఎక్కడ వ్యాక్సిన్ వేసుకున్నారు? వంటి సమాచారం.. ఇప్పుడు టెలిగ్రాంలో అందుబాటులో ఉండటం కలకలం రేపుతోంది. టెలిగ్రామ్లోని ఓ బాట్లో వ్యక్తుల ఫోన్ నంబర్ ఎంటర్ చేస్తే వారి సమస్త సమాచారం వెలుగుచూసింది. ఆధార్ వివరాలు ఎంటర్ చేసినా వివరాలు వచ్చాయి. విదేశాలకు వెళ్లేందుకు కొందరు కొవిన్ పోర్టల్లో పాస్పోర్ట్ వివరాలు కూడా అందించారు. అలాంటి వారి డేటా సైతం డేటా లీకేజీలో బయటకొచ్చినట్లు తెలుస్తోంది. వ్యక్తుల డేటా ఇలా బయటకు వచ్చిందన్న సమాచారం అనంతరం చాట్బాట్ నిలిచిపోయిందని తెలిసింది. అయితే.. సాధారణంగా కొవిన్ పోర్టల్లో లాగిన్ అయినప్పుడు.. మొబైల్కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసినప్పుడు మాత్రమే ఈ సమాచారం కనిపిస్తుంది. అలాంటిది.. ఎలాంటి ఓటీపీలతో సంబంధం లేకుండా ఈ డేటా బయటకి రావడం ఆందోళన కలిగిస్తోంది.
లీకైన డేటాలో పలువురు ప్రభుత్వ అధికారులతో పాటు, రాజకీయ నాయకుల పేర్లు, వారి వ్యక్తిగత వివరాలూ ఉన్నాయి. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ ఫోన్ నంబర్ ఎంటర్ చేస్తే ఆయన పూర్తి వివరాలు వస్తున్నాయని ‘మలయాళ మనోరమ’ పేర్కొంది. ఆయనతో పాటు కాంగ్రెస్ నేతలు జైరామ్ రమేశ్, కేసీ వేణుగోపాల్, పి చిదంబరం, టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ వంటి నేతల వివరాలు బయటకొచ్చాయి. ఈ డేటా లీకేజీపై తృణమూల్ అధికార ప్రతినిధి సాకేత్ గోఖలే స్పందించారు. ఇది తీవ్రమైన అంశమని పేర్కొంటూ మోదీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. సంబంధిత స్క్రీన్షాట్లను ట్విటర్లో పోస్ట్ చేశారు. దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది.