Covid Cases in India | దేశంలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తుంది. తాజాగా మరోసారి 12వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో కొత్తగా 12,193 మందికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయిందని శనివారం కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలను వెల్లడించింది. దీంతో క్రియాశీల కేసులు 67,556 (0.15శాతం)కి చేరాయి. నిన్న ఒక్కరోజు దేశంలో 42 మంది కరోనాతో మృతి చెందారు. అందులో కేరళ నుంచే 10 మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం రికవరీ రేటు 98.66 శాతంగా ఉంది. ఇప్పటివరకూ 220.66 కోట్ల టీకా డోసులు పంపిణీ చేసినట్టు కేంద్ర వైద్యాధికారులు పేర్కొన్నారు.
కరోనా పెరగటంతో మరోసారి రాష్ట్రాలను అప్రమత్తం చేసింది కేంద్ర సర్కారు. కరోనా ఇంకా పూర్తిగా ముగిసిపోలేదని.. రాష్ట్ర ప్రజలందరిని అప్రమట్టం చేయవలసిన బాధ్యత మనదని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ రాష్ట్రాలకు లేఖ రాశారు. కరోనాతో ఆసుపత్రిలో చేరికలు, మరణాల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ.. అధిక సంఖ్యలో కేసుల నమోదు స్థానికంగా వైరస్ వ్యాప్తిని సూచిస్తోందన్నారు. ప్రారంభంలోనే కరోనాను నియంత్రించే చర్యలు చేపట్టాలని సూచించారు.