ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ నామినేషన్ కార్యక్రమానికి హాజరవుతారు. ఆదిలాబాద్ పట్టణంలోని డైట్ కళాశాల మైదానంలో భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పాల్గొనే బహిరంగ సభ ఏర్పాట్లను పూర్తి చేశారు. ఉదయం హైదరాబాద్ నుంచి ముఖ్యమంత్రి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి ఆదిలాబాద్ పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన డైట్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు .సీఎం సభకు పార్లమెంటు పరిధిలోని ఏడు నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చే అవకాశం ఉండడంతో పకడ్బందీ ఏర్పాట్లను చేస్తున్నారు. జిల్లాలో ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని మధ్యాహ్నం వరకే బహిరంగ సభ ముగిసే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడకుండా వాటర్ బాటిల్లతో పాటు మజ్జిగ ప్యాకెట్లను అందు బాటులో ఉంచారు. డైట్ మైదానం వరకు ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.