స్వతంత్ర వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రోజుల కడప పర్యటన ముగిసింది. కడప విమానాశ్రయం నుంచి గన్నవరానికి తిరిగి బయల్దేరారు సీఎం జగన్. కడప నగరంలో రూ.871.77కోట్ల అభివృద్ధి పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేసారు. అందులో భాగంగా రూ.1.37 కోట్లతో పూర్తయిన రాజీవ్ పార్కు అభివృద్ధి పనులను, రూ. 5.61 కోట్లతో పూర్తయిన రాజీవ్ మార్గ్ అభివృద్ధి పనులను సీఎం జగన్ ప్రారంభించారు. సీఎం జగన్ మూడో రోజు పర్యటనలో భాగంగా.. భారీ స్థాయిలో పోలీసు బందోబస్తు నిర్వహిస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే ప్రాంతాల్లో ఎలాంటి అవాంతర సంఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
అంతకుముందు రెండో రోజు పర్యటనలో భాగంగా.. సీఎం జగన్ వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. మూడు చోట్ల సెవెన్ స్టార్ హోటళ్ల నిర్మాణాలకు గండికోటలో భూమిపూజ చేశారు. గండికోట, తిరుపతి, విశాఖలో వీటిని నిర్మించనున్నారు. ఈ సందర్భంగా.. ఏపీలో ఒబెరాయ్ గ్రూప్ పెట్టుబడులు పెట్టడం సంతోషమని, ఒబెరాయ్ గ్రూప్ ఇక్కడ సెవెన్ స్టార్ హోటల్ కడుతోందని అన్నారు. ఒబెరాయ్ సంస్థ రావడం వల్ల ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని స్పష్టం చేశారు.