లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తులో మునిగిపోయింది కమలం పార్టీ. ఇప్పటికే మొదటి జాబితా విడుదల చేసిన బీజేపీ.. ఇప్పుడు సెకండ్ లిస్ట్పై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఇవాళ సాయంత్రం బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది. సాయంత్రం ఆరు గంటలకు ఈ భేటీ జరగబోతోంది. ఈ భేటీలో లోక్ సభలో పోటీ చేసే బీజేపీ అభ్యర్థుల రెండో జాబితాను సిద్ధం చేయబోతు న్నారు. సెకండ్ లిస్ట్ లో దాదాపు 150కి పైగా లోక్సభ అభ్యర్థులను ఖరారు చేయబోతున్నారు కమలనా థులు.
నేటి బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో తెలంగాణలో మిగిలిన 8 స్థానాలకు లోక్ సభ అభ్యర్థులను ఎంపిక చేయబోతుంది అధిష్టానం. ఇప్పటికే తొలి జాబితాలో 9 స్తానాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన 8 స్థానాల్లో తాజాగా పార్టీలో చేరిన ఐదుగురికి అవకాశం కల్పించబోతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఖమ్మం నుంచి జలగం వెంకట్రావ్, ఆదిలాబాద్ నుంచి నగేశ్, మహబూబాబాద్ నుంచి సీతారాం నాయక్, నల్గొండ నుంచి సైదిరెడ్డి, పెద్దపల్లి నియోజ వర్గానికి గోమాస శ్రీనివాస్ పేర్లు ప్రకటించే అవకాశం ఉంది. అలాగే తొలి నుంచి పెండింగ్లో పెట్టిన మహబూబ్ నగర్ స్థానంపై కూడా ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వరంగల్ , మెదక్ స్థానాల నుంచి ఆరూరి రమేశ్, అంజిరెడ్డి పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.
ఎన్నికలకు ముందు తెలంగాణ బీజేపీలోకి భారీ సంఖ్యలో చేరుతున్నారు. బీఆర్ఎస్ నుంచి నేతలు వరుసగా చేరుతున్నారు. తాజాగా సీతారం నాయక్, సైదిరెడ్డి, జలగ వెంకట్రావ్ ఇతరులు బీజేపీలో చేరారు. కాంగ్రెస్ నుంచి శ్రీనివాస్ గోమాస కూడా బీజేపీలో చేరారు. తరుణ్ చుగ్ సమక్షంలో వారంతా కాషాయ కండువా కప్పుకున్నారు. బీజేపీ సిద్ధాంతాలు నచ్చి.. మోదీతో కలిసి పనిచేయాలనే బీజేపీలో చేరినట్టు సీతారాం నాయక్ చెప్పారు.


