సి.నారాయణరెడ్డి 93వ జయంతి సందర్భంగా..తెలుగు సినిమా పరిశ్రమపై తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. గద్దర్ అవార్డులపై ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలకు తెలుగు పరిశ్రమ నుంచి స్పందన లేకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. నిన్న ఓ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. నంది అవార్డులలా తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులు ఇవ్వాలనుకుంటోందని, కానీ తెలుగు ఇండస్ట్రీ నుంచి దీనిపట్ల స్పందన రాలేదనీ అన్నారు.
తన అంతట తాను అడిగినా కూడా ఎవరూ ముందుకు రావడం లేదని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గద్దర్ అవార్డుల అంశంపై సినిమా పరిశ్రమ మౌనంగా ఉంటోందన్నారు. సినీ పెద్దల నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరమని చెప్పారు. గద్దర్ జయంతి సందర్భంగా..రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 9న గద్దర్ అవార్డులు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని చెప్పానన్నారు.
దీనిపై టాలీవుడ్ హీరో చిరంజీవి స్పందించారు. తెలంగాణ సీఎం చొరవ తీసుకుని సినిమా అవార్డులను పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకోవడం హర్షణీయం ట్వీట్ చేశారు. ప్రభుత్వ ప్రతిపాదనను తెలుగు చిత్ర పరిశ్రమ తరఫున ఫిలిం చాంబర్, నిర్మాతల మండలి ముందుకు తీసుకెళ్లాలని ట్వీట్లో పేర్కొన్నారు.