మెగాస్టార్ చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆయనే స్వయంగా క్లారిటీ ఇచ్చారు. బ్రహ్మా ఆనందం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఇక జీవితాంతం కళామ్మతల్లి సేవలోనే ఉంటానని చెప్పారు. చిరంజీవి ఇటీవల లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చేసిన కామెంట్లు వైరల్ అయిన సంగతి తెలిసిందే. స్టేజ్ మీద నుంచి జై జనసేన అంటూ నినాదం చేశారు. అయితే ఈ కామెంట్ల తర్వాత చిరంజీవి రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇస్తారంటూ వార్తలు వచ్చాయి. తాజాగా ఈ రూమర్స్పై చిరంజీవి రియాక్ట్ అయ్యారు. ఇక తన జీవితం మొత్తం సినిమాలేనని మరోసారి రాజకీయాల్లోకి వెళ్లే ఉద్దేశమే లేదని తేల్చిచెప్పారు.
“పాలిటిక్స్కి వెళ్లిన తర్వాత నేను చాలా ఒత్తిడి అనుభవించాను. నన్ను అన్నవాడిని అననివాడిని కూడా తిట్టాల్సి వచ్చేది.. కూర్చొని మరీ ఏం తిట్టాలో రాసుకోవాల్సి వచ్చేది. నా పరిస్థితి చూసి సురేఖ ఏంటండి మీరు నవ్వడమే మానేశారు అనేది. అప్పుడు ఒక్కటే అనిపించేది. నాలో హాస్య గ్రంథులు దొబ్బేసేయా అని. కానీ తిరిగి సినిమాల్లోకి వచ్చాక నాలో ఆ ఫన్ మళ్లీ వచ్చింది. ఇక అనిల్ రావిపూడి సినిమా స్టోరీ లైన్ విన్నాక మళ్లీ పూర్తిగా హాస్య గ్రంథులు వచ్చేస్తాయి అనే నమ్మకం కలిగింది. ఖచ్చితంగా మన కాంబినేషన్ ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అవుతుంది. అలానే ఇక మరో క్లారిటీ కూడా ఇవ్వాలనుకుంటున్నా. ఈ జన్మంతా ఇక రాజకీయాలకి దూరంగా ఉంటాను. అలానే సినిమాలకి దగ్గరగానే ఉంటా. చాలా మందికి డౌట్స్ వస్తున్నాయి.. ఏంటి చిరంజీవి పెద్ద వాళ్లని కలుస్తున్నాడని. కానీ డౌట్ అక్కర్లేదు.. పొలిటికల్గా వెళ్లడం ఇక లేదు.. పొలిటికల్గా ముందుకు వెళ్లడానికి, నా ఆశయాలు సాధించడానికి, సేవ చేయడానికి పవన్ కళ్యాణ్ ఉన్నాడు.. ముందుకెళ్తున్నాడు. నేను ఇక సినిమాలకే అంకితం” అంటూ చిరంజీవి చెప్పారు.