తెలుగు రాష్ట్రాల్లో వీధి కుక్కల బెడద ఎక్కువైపోతోంది. చాలా చోట్ల స్వైర విహారం చేస్తూ చిన్న పిల్లలపై దాడికి పాల్పడుతున్నాయి. కొన్ని ఘటనల్లో అయితే కుక్కల దాడుల్లో పిల్లలు చనిపోతున్నారు. దాంతో కుక్కలు అంటేనే జనం బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా మెట్టవలసలో వీధి కుక్కలు రెచ్చిపోయాయి. ఇంటి ముందు ఆడుకుంటున్న ఏడాదిన్నర వయసున్న చిన్నారిపై విచక్షణారహితంగా దాడి చేశాయి. దీంతో చిన్నారి మెడ, తల, మొహంపై తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఎంతో అల్లరిముద్దుగా పెంచుకుంటున్న తమ బిడ్డ ఇలా కుక్కల దాడిలో చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ప్రభుత్వంతో పాటు అధికారులు ఇప్పటికైనా స్పందించి కుక్కల బెడద నుంచి పిల్లల ప్రాణాలు కాపాడాలని వేడుకుంటున్నారు.