చిత్తూరు జిల్లాలో అటవీ భూముల కబ్జా ఆరోపణలను మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఖండించారు. మంగళంపేటలో అటవీ భూములను ఆక్రమించుకోలేదని అన్నారాయన. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. 25 ఏళ్లుగా ఆ భూములు తమ ఆధీనంలోనే ఉన్నాయని చెప్పారు. గతంలోనే విచారణ జరిపి అటవీ భూములు లేవని చెప్పారని అన్నారు. గతంలో రూ.50 కోట్ల పరువు నష్టం దావా వేశానని … పుంగనూరులో తనకు ఎస్టేట్ ఉందంటూ తప్పుడు ప్రచారం చేశారని.. చంద్రబాబు కుట్రలు చేయడంలో దిట్ట అని ఆరోపించారు. ఎంతమంది పార్టీని వీడినా వైసీపీకి ఏమీ కాదని అన్నారు. విజయసాయిరెడ్డి రాజీనామా ఆయన వ్యక్తిగతమని అభిప్రాయపడ్డారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
పులిచర్ల మండలం మంగళంపేట రెవెన్యూ గ్రామ పరిధిలో 75 ఎకరాల అటవీ భూములు అక్రమంగా పెద్దిరెడ్డి కుటుంబం పరిధిలో చేరిందనేది ఆయనపై ఉన్న ప్రధాన అభియోగం. అలాగే పుంగనూరు, తంబళ్లపల్లి, రేణిగుంట మండలాల్లో రికార్డుల తారుమారు, బినామీ పేర్లతో వందల ఎకరాలను ఆక్రమించుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.
ఇక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల ఆక్రమణలపై డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి పవన్కల్యాణ్ విచారణకు ఆదేశించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ను పవన్ ఆదేశించారు. దీనిపై వెంటనే విచారణ చేపట్టి నివేదికను సమర్పించాలని ఆదేశించారు.