స్వతంత్ర వెబ్ డెస్క్: పేదవారి రక్తం తాగే అలవాటు తనకు లేదని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. గ్రోత్ సెంటర్ భూములపై రామోజీకి మంత్రి బొత్స సవాల్ విసిరారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, పరిశ్రమలకు ప్రభుత్వం రాయితీల మీద భూమి ఇస్తుందన్నారు.
గ్రోత్ సెంటర్ ద్వారా ఇథనాల్ ఫ్యాక్టరీ నిర్మాణం జరుగుతోంది. కావాలంటే మాకు ఇచ్చిన భూములు అదే రేటుకు రామోజీకి ఇస్తాం.రామోజీ అక్కడే పరిశ్రమ స్థాపించాలి. గ్రోత్ సెంటర్ భూములకు 2018లో జీవో ఇచ్చింది టీడీపీ ప్రభుత్వమే. వినేవాడు ఉంటే చంద్రబాబు ఏమైనా చెప్తారు’’ అంటూ మంత్రి బొత్స మండిపడ్డారు.
చంద్రబాబులా దళారులను పెట్టి దోచుకోలేదన్నారు. ముగ్గురు మూడు దిక్కులు తిరిగి ప్రభుత్వంపై అక్కసు వెళ్లగక్కుతున్నారని.. చంద్రబాబు, పవన్, లోకేష్ ఎందుకు సహనం కోల్పోతున్నారంటూ మంత్రి ప్రశ్నించారు.
ప్రత్యేక హోదాను ప్యాకేజీ కోసం తాకట్టు పెట్టింది చంద్రబాబే.. ప్రత్యేక హోదా రాష్ట్రానికి కావాలి. హోదాను మేము తాకట్టు పెట్టలేదు.. మీలాగా స్వీట్స్ పంచుకోలేదు. రైతుల ఆత్మహత్యలు మీ హయాంలో జరగలేదా చంద్రబాబు. ఎదుట వారు ఏమనుకుంటారనే సిగ్గు కూడా చంద్రబాబుకు లేదు.
రుషికొండలో నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వ భవనాలు కడుతున్నామని ఏడాది క్రితమే చెప్పాము. నిబంధనలు తుంగలో తొక్కి ప్రజా వేదికను నిర్మించారు. విద్య, వైద్యం, వ్యసాయం సంక్షేమం నాలుగు రంగాలకు సీఎం జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారు. దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోందని మంత్రి పేర్కొన్నారు.


