Simhadri Temple | ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాద్రి అప్పన్న ఆలయంలో చందనోత్సవ కార్యక్రమం ప్రారంభమైంది. సింహాద్రి అప్పన్న నిజరూపాన్ని భక్తులు కనులారా దర్శించుకుంటున్నారు. స్వామి వారి నిజరూప దర్శనాన్ని తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో కొండకు వస్తున్నారు. ఇప్పటికే క్యూలైన్లు అన్ని భక్తులతో కిక్కిరిసిపోయాయి. టీటీడీ తరుఫున సింహాద్రి అప్పన్నకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. టీటీడీ అధికారులతో ఆలయానికి చేరుకున్న ఆయనకు.. అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. సింహాద్రిలో స్వామి వారికి చేయు కైంకర్యాలు.. వేదమంత్రోచ్చారణల నడుమ వైభవంగా జరుగుతున్నాయి.
అప్పన్నను దర్శించుకోవడానికి వస్తున్న భక్తులతో సింహాద్రి జనసంద్రంగా మారింది. వాహనాలన్నీ సింహాచలం కొండకు రావడంతో ఘాట్ రోడ్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బస్సులు, వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. మరో వైపు చందనోత్సవం కోసం అదనంగా 60 బస్సులు ఏర్పాటు చేశారు అధికారులు. రద్దీ ఎక్కువ కావడంతో ఘాట్ రోడ్డు మీదుగా భక్తులు నడుచుకుంటూ గుడికి చేరుకుంటున్నారు.