స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో పాగా వేద్దామని బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి ప్రజలకు పిలుపునిచ్చారు. హైదరాబాదులోని సరూర్ నగర్ స్టేడియంలో బీఎస్పీ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ భరోసా సభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీఎస్పీ కేవలం ఎస్సీల కోసం కాదని, సబ్బండ వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తుందని తెలిపారు. ఉత్తరప్రదేశ్లో ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీనవర్గాల జీవితాల్లో వెలుగులు నింపామని పేర్కొన్నారు. తెలంగాణలో పేద దళితులకు 3ఎకరాల భూమి ఇస్తామని సీఎం కేసీఆర్ మాట తప్పారని విమర్శించారు.
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రసంగిస్తూ బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు తోడు దొంగలని ఆరోపించారు. అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతే సీఎం కేసీఆర్ కనీసం ప్రగతిభవన్ కూడా దాటలేదని విమర్శించారు. తెలంగాణలో బహుజన రాజ్యం కోసం బీసీ, ఎస్టీ, ఎస్సీలు, మైనార్టీలు ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీఎస్పీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు సంక్షేమ నిధి ఏర్పాటు చేసి అన్నదాతలను ఆదుకుంటామని ఆర్ఎస్పీ హామీ ఇచ్చారు. సరూర్నగర్ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి బీఎస్పీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.