స్వతంత్ర వెబ్ డెస్క్: తమిళనాడులో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. పట్టపగలు అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై ఒక వ్యక్తిని వెంటాడి చంపేసిన ఘటన భయాందోళనకి గురి చేస్తుంది. తమిళనాడులోని కారైకుడి జిల్లాలో 29 ఏళ్ల వ్యక్తిని ఐదుగురు నరికి చంపారు. బాధితుడు మధురై వాసి అరివళగన్ అలియాస్ వినీత్గా గుర్తించారు. హత్య కేసులో సంబంధం ఉన్న అతడిని పోలీసులు సంతకం చేేసేందుకు పిలిచిన సమయంలో ఈ హత్య జరిగింది. వినీత్ రద్దీగా ఉన్న రోడ్డుపై వెళ్తున్న సమయంలో, ఒక కారులో వచ్చిన ఐదుగురు వ్యక్తులు వినీత్ ను చుట్టుముట్టారు. తప్పించుకునే ప్రయత్నంలో వినీత్ పరిగెత్తడం అక్కడ ఉన్న కెమెరాల్లో రికార్డ్ అయింది.
పరిగెత్తుతున్న క్రమంలో వినీత్ కిందపడిపోగా ఐదుగురు వ్యక్తులు కర్రలు, రాడ్లతో దాడి చేశారు. ఆ సమయంలో సంఘటన స్థలంలో ఉన్న వ్యక్తి రక్షించడానికి వచ్చినప్పటికీ ఫలించలేదు. ఐదుగురు వ్యక్తులు కారులో పారిపోగా, వినీత్ రోడ్డుపై పడి ఉన్నాడు. వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. పోలీసులు అతని స్నేహితులను అదుపులోకి తీసుకుని విచారించగా దుండగుల కోసం గాలిస్తున్నారు. వినీత్ షరతులతో కూడిన బెయిల్పై బయటకు వచ్చి ఇద్దరు స్నేహితులతో కలిసి ఓ లాడ్జిలో ఉంటున్నాడు.