తెలంగాణలో రైతు చుట్టూ రాజకీయం తిరుగుతోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య డైలాగ్ వార్ ముదురుతోంది. విమర్శలు, ప్రతివిమర్శలు, సవాళ్లు, ప్రతిసవాళ్లతో పొలిటికల్ హీట్ సెగలు కక్కుతోంది. అన్నదాతకు అండగా పోరుబాట పట్టిన గులాబీ దళం రేవంత్ సర్కార్పై విరుచుకుపడటంతో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి.
అన్నదాతకు అండగా బీఆర్ఎస్ పోరు బాట పట్టింది. రాష్ట్రవ్యాప్తంగా రైతు దీక్ష పేరుతో ఆందోళనకు దిగింది. పంటలు ఎండిపోవడానికి రేవంత్ సర్కారే కారణమని ఆరోపిస్తూ కాంగ్రెస్ను టార్గెట్ చేసింది. కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరవే అంటున్న గులాబీ నేతలు.. పంట ఎండి నష్టపోయిన రైతులను ఆదుకోవాలని.. అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనను ఉధృతం చేస్తోంది.
తమ ప్రభుత్వంలో పుట్ల కొద్దీ పంటలు పండగా.. కాంగ్రెస్ హాయాంలో కరువుతో రైతులు అల్లాడు తున్నారని ఆరోపిస్తోంది బీఆర్ఎస్. తమపై బురదజల్లేందుకే కాళేశ్వంపై లేనిపోని అబాండాలు వేస్తూ రైతులకు సాగు నీరు లేకుండా చేసిందని మండిపడుతోంది. ఈ క్రమంలోనే పదే పదే ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువనే నినాదాన్ని హోరెత్తిస్తున్నారు గులాబీ నేతలు. ఇక తెలంగాణ వ్యాప్తంగా జరిగిన రైతు దీక్షలో అన్నదాతలను ఆదుకోవాలని డిమాండ్ చేసింది బీఆర్ఎస్. సాగునీరు అందక, కరెంటు లేక లక్షలాది ఎకరాల్లో పంటనష్టపోయిన రైతులకు ఎకరానికి ఎకరానికి 25 వేల రూపాయలు ఇవ్వాలని,.. వరి, మొక్కజొన్న పంటకు క్వింటాలకు 500 రూపాయల బోనస్, అలాగే వెంటనే 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా కింద ఎకరానికి 15 వేలు ఇవ్వాలని కోరారు. రైతు దీక్షలో భాగంగా సిరిసిల్లా జిల్లాలో కేటీఆర్, సంగారెడ్డి జిల్లాలో హరీష్రావు రేవంత్ సర్కార్పై నిప్పులు చెరిగారు. కేసీఆర్ హయాంలో పుట్ల కొద్దీ వడ్లు పండితే… కాంగ్రెస్ హాయాంలో రైతులకు పుట్టెడు కష్టాలు పడుతున్నారని అన్నారు హరీష్రావు. చిల్లర రాజకీయాలను పక్కనపెట్టి అన్నదాతలను ఆదుకోవాలని.. తమను ఎంతైనా తిట్టినా సరే కానీ రైతుల్ని కాపాడండని వ్యాఖ్యానించారు. డిసెంబర్ 9నాడే రుణమాఫీ చేస్తామని.. 4 నెలలయినా చేసింది లేదని రేవంత్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. అబద్దపు హామీలతో రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ.. రైతులను నట్టేట ముంచిందని ఫైర్ అయ్యారు. ఇక ఇదే సందర్భంగా బీజేపీపై కూడా మండిపడ్డారు హరీష్రావు. కాంగ్రెస్, బీజేపీలు రెండు రెండేనని నిప్పులు చెరిగారు.
కాంగ్రెస్ తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువని మరోసారి విరుచుకుపడ్డారు కేటీఆర్. ఎన్నికల కోడ్ పేరుతో కుంటిసాకులు చెప్పి తప్పించుకుంటున్నారని మండిపడ్డారు. రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈసీకి లేఖ రాద్దామన్నారు. కాంగ్రెస్కు ఓటేసిన వారంతా ఇప్పుడు బాధపడుతున్నారని చెప్పుకొచ్చారు. సాధారణం కంటే 14 శాతం ఎక్కవు వర్షాలు పడినప్పటికీ.. వానలు లేవని మంత్రులు అబద్దాలు మాట్లాడు తున్నారంటూ శ్రీధర్బాబుపై ధ్వజమెత్తారు. ఇక తెలంగాణ వ్యాప్తంగా రైతు దీక్షను విజయవంతం చేశారు గులాబీ శ్రేణులు. తమ తమ నియోజకవర్గాల్లో ఎద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులైన ఎర్రబెల్లి దయాకర్రావు, గంగుల కమాలకర్ సహా ముఖ్య నేతలంతా రేవంత్ సర్కార్పై విమర్శనాస్త్రాలు సంధించారు. తక్షణమే రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతు దీక్షతో తెలంగాణ రాజకీయాల్లో మరింత కాకరాజుకుంది. అన్నదాతల కోసం మా పోరాటం అంటూ రేవంత్ సర్కార్పై గులాబీ దళం చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు హస్తం నాయకులు. మరి బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్నట్టు ఎలక్షన్ కమిషన్ను ఒప్పించి రాష్ట్ర ప్రభుత్వం పంటనష్టపరిహారం అందిస్తుందా..? వరి, మొక్కజొన్నకు బోనస్ ప్రకటిస్తుందా అన్నది ఆసక్తిగా మారింది.


