పార్లమెంట్ ఎన్నికలపై గులాబీ బాస్ ఫోకస్ పెట్టారు. అధికారం కోల్పోయి ఢీలాపడ్డ పార్టీ క్యాడర్లో ఉత్సాహం నింపేందుకు.. కాంగ్రెస్, బీజేపీ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే 19 రోజులపాటు బస్సు యాత్రతో సుడిగాలి పర్యటనతో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించనున్నారు కేసీఆర్.
పార్లమెంట్ ఎన్నికల పోరు తెలంగాణలో హోరాహోరీగా సాగుతోంది. ప్రధాన పార్టీలైన బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్య త్రిముఖ పోరు నెలకొంది. ఈ క్రమంలో గెలుపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది బీఆర్ఎస్. అధికారం కోల్పోయి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న వేళ.. పార్లమెంట్ ఎన్నికల్లో అయినా గెలిచి తమ సత్తా చాటాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు గులాబీ బాస్. అయితే ఈ ప్రచారంలో నయా ప్లాన్తో కేసీఆర్ ముందుకు సాగనున్నారు. గతానికి భిన్నంగా బహిరంగ సభలకు బదులుగా బస్సు యాత్రకు కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెల 24 నుంచి 17 రోజులపాటు ప్రజాక్షేత్రంలో ఉండనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కార్నర్ మీటింగ్స్, రోడ్షోలతో ప్రచారాన్ని హోరెత్తించనున్నారు.మొత్తంగా 17 రోజుల పాటు జరిగే కేసీఆర్ బస్సు యాత్రలో 21 చోట్ల రోడ్ షోలు నిర్వహించేలా బీఆర్ఎస్ షెడ్యూల్ ఖరారు చేసింది. ఈ నెల 24న నల్గొండ జిల్లా మిర్యాలగూడ రోడ్ షోతో కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభం కాగా.. మే 10వ తేదీన సిద్దిపేటలో రోడో షోతో ముగియనుంది. కేసీఆర్ బస్సు యాత్ర వేళ ఆయన బస చేసే ప్రాంతంలోనే.. పార్టీ శ్రేణులు, ఉద్యమ సమయంలో తనతో కలిసిన నేతలు, మేధావులతో సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. పరిస్థితులను బట్టి పలు ప్రాంతాల్లో పంట నష్టపోయిన రైతులను, ధాన్యం కొనుగోలు కేంద్రాలను కేసీఆర్ సందర్శించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాల వైఫల్యాలే ప్రధాన అస్త్రాలుగా కేసీఆర్ లోక్సభ ఎన్నికల ప్రచారం సాగనుంది. ఇదే సమయంలో పదేళ్ల బీఆర్ఎస్హయాంలో రాష్ట్రంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల లబ్ధిని కూడా వివరించనుంది బీఆర్ఎస్.
బస్సు యాత్రలో మొదటి రోజు ఏప్రిల్ 24న మిర్యాలగూడ, సూర్యాపేటలో పర్యటించనుండగా.. ఏప్రిల్ 25న భువనగిరి, ఏప్రిల్ 26 మహబూబ్నగర్, ఏప్రిల్ 27న నాగర్కర్నూల్, ఏప్రిల్ 28 వరంగల్లో బస్సుయాత్ర సాగుతుంది. ఆ తర్వాత ఏప్రిల్ 29న ఖమ్మం, ఏప్రిల్ 30న తల్లాడ, కొత్తగూడెం, మే 1 మహ బూబాబాద్లో… అలాగే మే 2న జమ్మికుంట, మే 3న రామగుండం, మే 4న మంచిర్యాల, మే 5న జగిత్యాల, మే 6న నిజామాబాద్, మే 7న కామారెడ్డి, మే 8న నర్సాపూర్, పటాన్చెరులలో కేసీఆర్ బస్సుయాత్ర సాగనుంది. మే 9న కరీంనగర్, మే 10 సిరిసిల్ల, సిద్దిపేటతో యాత్ర ముగియనుంది. మరి బీఆర్ఎస్ అధినేత వ్యూహం ఫలిస్తుందా..? లోక్సభ ఎన్నికల్లో గులాబీ సత్తా చాటుతుందా.. అన్నది తెలియాలంటే పార్లమెంట్ ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.