దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడనున్నాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసింది. 19 కౌంటింగ్ కేంద్రాల వద్ద మొత్తంగా 10 వేల మంది పోలీసులను మూడంచెల్లో మోహరించింది.
నాలుగోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయాలన్న పట్టుదలతో ఆప్ ఉంది. కేజ్రీవాల్ పార్టీని గద్దె దించి 26 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి ఢిల్లీ పాలనా పగ్గాలు దక్కించుకోవాలన్న కసితో బీజేపీ ఉంది. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా… ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన కనీస మెజార్టీ 36 సీట్లు.
ఢిల్లీలో ప్రధానంగా ఆప్, బీజేపీ మధ్య ముఖాముఖి పోరు నెలకొంది. ఆ రెండు పార్టీలూ విజయంపై వేటికవే ధీమాగా ఉన్నాయి. తాము దాదాపు 50 సీట్లు గెలుస్తామని బీజేపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నాలుగోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆప్ నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.
ఇక, ఎగ్జిట్ పోల్స్లో బీజేపీ వైపు మొగ్గుచూపాయి. అయితే, ఎగ్జిట్ పోల్స్ అంచనాలను కొట్టిపారేస్తున్న ఆప్.. తాము అధికారంలో కొనసాగడం ఖాయమని చెబుతోంది.
గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఢిల్లీలో శూన్యహస్తాలతో వెనుదిరిగిన కాంగ్రెస్ పార్టీ.. ఈసారి పరువు నిలబెట్టుకోవాలని ఆరాటపడుతోంది. ఈ నెల 5న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 60.54 శాతం మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు.