లోక్సభ ఎన్నికల్లో విజయం కోసం భారతీయ జనతా పార్టీ వ్యూహత్మకంగా అడుగులేసింది. ప్రధాని నరేంద్ర మోడీ – కేంద్రమంత్రి అమిత్ షా ఈ ప్రచార కంటెంట్కు తుదిరూపు ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ ఏ రాష్ట్రానికి వెళ్లినా, అక్కడి పరిస్థితులను బట్టి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రధానంగా ఇండియా కూటమికి ఒక నాయకత్వం అంటూ లేదన్న అంశంపై కమలనాథులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయం సాధిస్తే , నరేంద్ర మోడీ ప్రధాని అవుతారని కమలనాథులు పేర్కొన్నారు. అదే ఇండియా కూటమి గెలిస్తే , ఎవరు ప్రధాని అవుతారని సూటిగా ప్రశ్నించారు బీజేపీ నాయకులు. అయితే ఇప్పటివరకు కమలనాథుల ప్రశ్నకు ఇండియా కూటమి నుంచి సరైన సమాధానం రాలేదు.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాత్రం కమలనాథుల ప్రశ్నకు స్పందించారు. ఎవరు ప్రధాని అవుతారన్న విషయం ఇప్పటికి అప్రస్తుతమన్నారు. ఇండియా కూటమి గెలుపు తరువాత ఆ విషయం గురించి ఆలోచిస్తామన్నారు. దీంతో ఇండియా కూటమికి ఒక నాయకుడంటూ లేరన్న సంకేతాలు సామాన్య ప్రజల్లోకి వెళ్లాయి. అంతేకాదు ఇండియా కూటమి గెలవడం అంటూ జరిగితే, ప్రధాని పదవి కోసం భాగస్వామ్య పక్షాల్లో యుద్ధం జరుగుతుందన్న ప్రచారాన్ని ప్రజల్లో బలంగా తీసుకెళ్లింది కమలం పార్టీ. మొత్తానికి బీజేపీ వ్యూహం వర్క్ అవుట్ అయింది. ఒక నాయకుడంటూ లేని ఇండియా కూటమిని ప్రజలు వద్దనుకున్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీకి జనం పట్టారు.
ఒడిశా ఎన్నికల ప్రచారంలో అభివృద్దిని కీలకాంశంగా చేసుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఒడిశా ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ పాతికేళ్లుగా కొనసాగుతున్నప్పటికీ, ఆ రాష్ట్రం అభివృద్ది విషయంలో వెనుకబడిందని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అదే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటే ఒడిశాను దేశంలోనే నెంబర్ ఒన్ రాష్ట్రం అయ్యేద న్నారు. దీంతో బీజేపీతోనే అభివృద్ది సాధ్యమన్న అభిప్రాయాన్ని ఒడిశా ప్రజల్లో కలిగించారు నరేంద్ర మోడీ. మొదటి విడత పోలింగ్ ముగిసిన తరువాత హిందూ ఓట్ బ్యాంక్ పోలరైజేషన్కు వ్యూహాత్మకంగా వ్యవహరించారు నరేంద్ర మోడీ. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే , యావత్ ప్రజల సంపదను ముస్లిం మైనారిటీలకు దోచుపెడుతుం దని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. రాజస్థాన్లోని అనేక ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పుడు నరేంద్ర మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు తన వాదనకు మద్దతుగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలను ఆయన ఉదహరించారు. నరేంద్ర మోడీ చేసిన ఈ వ్యాఖ్యలు హిందూ సమాజంలో దుమా రం రేపాయి. అంతిమంగా హిందూ ఓట్బ్యాంక్ కమలం పార్టీకి అనుకూలంగా పోలరైజ్ అయింది.
ముస్లింలకు రిజర్వేషన్ల అంశంపై కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు కూడా హిందూ ఓట్ బ్యాంక్ను బలోపేతం చేశాయని చెప్పవచ్చు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ లో అమలవుతున్న ముస్లింల నాలుగు శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తామని అమిత్ షా పేర్కొన్నారు. అంతే కాదు ముస్లింలకు రద్దు చేసే నాలుగు శాతం రిజర్వేషన్లను వెనుకబడిన తరగతుల కోటాలో చేరుస్తామ న్నారు. హిందూ ఓట్ బ్యాంక్ను ప్రధానంగా వెనుకబడిన తరగతులను ఆకట్టుకోవడమే అమిత్ షా ప్రకట నలోని పరమార్థం. అంతేకాదు ఎన్నికల ప్రచారంలో అనేకసార్లు జాతీయవాదాన్ని ప్రస్తావించారు. కేంద్రం లో బీజేపీ సర్కార్ ఉంటేనే దేశం పటిష్టంగా ఉంటుందనే అభిప్రాయం సామాన్య ప్రజల్లో కలిగేలా నరేంద్ర మోడీ ప్రచారం సాగించారు. బలమైన నాయకుడు ఉంటేనే దేశం బలంగా ఉంటుందనే అభిప్రా యం జనంలో కలిగింపచేయడంలో నరేంద్ర మోడీ విజయవంతమయ్యారనే చెప్పవచ్చు.
ఒకదశలో లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవాలని పాకిస్తాన్ కోరుకుంటోందని ప్రచారం సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు నరేంద్ర మోడీ. హస్తం పార్టీ అగ్రనాయకత్వానికి పాకిస్తాన్ పాలకులకు ఫ్రెండ్ షిప్ ఉందనే సంకేతాలు వ్యూహాత్మకంగా వదిలారు మోడీ. ప్రజల్లో ఉన్న పాకిస్తాన్ వ్యతిరేకతను రెచ్చగొట్టి తద్వారా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే ప్రయత్నాలు చేశారు నరేంద్ర మోడీ. ఏమైనా ఎన్నికల ప్రచారంలో అడుగడుగునా వ్యూహాత్మకంగా వ్యవహరించారు ప్రధాని నరేంద్ర మోడీ.


