స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణలో మరికొన్ని నెలల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారు. ముఖ్యంగా కీలక నేతలను పార్టీలో చేర్చుకొని పార్టీని బలోపేతం చేసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పటికే కీలక నేతలను పార్టీలో చేర్చుకొని జోష్ మీదున్న హస్తం పార్టీకి బిగ్ షాక్ తగిలింది. పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్, మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి ఇప్పటికే రాజీనామా చేయగా.. వారు బీజేపీ గూటికి చేరనున్నట్టు తెలుస్తుంది.
ఈరోజు వీరు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని కలవనున్నట్టు తెలుస్తుంది. ఏలేటి మహేశ్వర్ తో కలిసి వీరంతా ఢిల్లీకి వెళ్లినట్టు..అక్కడే జాతీయ నేతల సమక్షంలో కాషాయకండువా కప్పుకోనున్నట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఈ రాజీనామాలు షాకివ్వగా.. బీజేపీకి మాత్రం ఈ చేరికలు మరింత బలాన్ని చేకూర్చనున్నాయి. ఇక వీరితో పాటు చెన్నూరు మాజీ ఎమ్మెల్యే సంజీవరావు, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి కూడా బీజేపీలో చేరనున్నట్టు ప్రచారం జరుగుతుంది.