స్వతంత్ర వెబ్ డెస్క్: గ్రూప్ 2(Group 2) పోస్టుల కోసం దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అభ్యర్థుల కోరిక మేరకు పరీక్షను వాయిదా వేయాలనే నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర మంత్రి కేటీఆర్(Minister KTR) ట్విట్టర్లో(Twitter) వెల్లడించారు. సీఎం కేసీఆర్ (CM KCR,)ఆదేశాల మేరకు టీఎస్పీఎస్సీ చైర్మన్, సెక్రెటరీలతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చర్చ చేశారు. అనంతరం, గ్రూప్ 2 పరీక్షను నవంబర్ నెలకు వాయిదా వేసినట్టు తెలిపారు.
త్వరలోనే తేదీలపై స్పష్టత రానుంది. గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయడానికి టీఎస్పీఎస్సీని(TSPSC) సంప్రదించాలని ప్రధాన కార్యదర్శికి సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినట్టు కేటీఆర్ ట్వీట్ చేశారు. లక్షలాది మంది అభ్యర్థులకు ఇబ్బంది కలగకుండా ఈ పరీక్ష వాయిదా వేయాలని సూచించినట్టు వివరించారు. అంతేకాదు, భవిష్యత్లోనూ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లు జారీ చేసేటప్పుడు ఒకేసారీ అన్నింటినీ విడుదల చేయకుండా తగిన వ్యవధి ఇస్తూ అభ్యర్థులు పరీక్షలకు సన్నద్ధులు కావడానికి తగిన సమయం ఉండేలా చూసుకోవాలని చీఫ్ సెక్రెటరీకి సీఎం కేసీఆర్ సూచనలు చేశారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.


