హైదరాబాద్ చుట్టుపక్కల పేదల భూముల్లో అడుగు పెడితే ఊరుకోమని హెచ్చరించారు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్. వ్యవస్థలు పనిచేయని కారణంగానే ఎంపీగా తాను వెళ్లి మేడ్చల్ జిల్లాలో మాఫియాపై చేయి చేసుకున్నానని అన్నారు.
పేదల కోసం పోరాటం చేస్తే పోలీసులు పెట్టే కేసులకు భయపడను. తెలంగాణ ఉద్యమంలో 150 కేసులు ఉన్నాయి. ఇప్పుడు 156 అవుతాయి. టైగర్ నరేంద్ర, బద్దం బాల్ రెడ్డి, బండారు దత్తాత్రేయ వరకు పేదలకి అండగా ఉన్న పార్టీ బీజేపీ. రేవంత్ సర్కారు రావడంతోనే హైడ్రా పేరుతో పేదలపై విరుచుకుపడింది. హైడ్రా, మూసీ బాధితులకు బీజేపీ అండగా నిలబడింది. రియల్టర్ల పేరుతో దౌర్జన్యానికి దిగుతున్నారని సీపీ దృష్టికి తీసుకెళ్లాం. కానీ ఫలితం లేదు. కలెక్టర్, సీపీకి సమస్య వివరించినా పరిష్కారం దొరకలేదు. కబ్జా చేసి పహిల్వాన్లను పెట్టి స్థానికులను, మహిళలను బెదిరించారు.
ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందో వారి దౌర్జన్యాలు చూస్తే అర్ధం అవుతుంది. నేను ఎవరిని కొట్టాలని అనుకోలేదు. కానీ వ్యవస్థ విఫలం అయింది. పేదల బాధ చూసి ఆవేశం వచ్చింది. పేదల జోలికి వచ్చినా, మహిళలను ఇబ్బంది పెట్టినా చీల్చి చెండాడుతామ్.
2005లో ఏకశిలా నగర్ రాజు, వెంకటేష్, భాస్కర్ అనే ముగ్గురు కొంత భాగాన్ని కొన్నట్టు దొంగ డాక్యుమెంట్స్తో లోన్ తీసుకున్నారు. 2010 లో అవన్నీ ప్లాట్లు అని పేదలకు అనుకూలంగా తీర్పు వచ్చింది.
హర్ష కన్స్ట్రక్షన్ కంపెనీ వెంకటేష్ ప్లాట్ల ఓనర్లను ఇంకా భయపెడుతున్నారు. ధరణి లొసుగులతో ఇష్టారీతిన ల్యాండ్ లు మార్చుకున్నారు . అధికారులు కూడా నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. బాసుల మెప్పు కోసం కాదు పేదలకు న్యాయం చేసేలా అధికారులు పని చేయాలి. అధికారులు ఇష్టారీతిన వ్యవహరిస్తే DOPT కి ఫిర్యాదు చేస్తాం. నాడు, నేడు సీఎంల కార్యాలయాల్లోనే ఈ ల్యాండ్ మార్పిడులు జరుగుతున్నాయి కాళేశ్వరం కాదు అంతకంటే ఎక్కువ కోట్ల అవినీతి ఈ ల్యాండ్ దందాలో జరిగింది” .. అని ఈటల చెప్పారు.