Summer Effect | తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ నెల ఆరంభం నుండే ఎండలు దంచికొడుతున్నాయి. భానుడి విజృంభణతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 8 అయ్యిందంటే చాలు.. సూర్యుడు చురకలు అంటిస్తున్నాడు. అధిక ఎండల నేపథ్యంలో వాతావరణ శాఖ అప్రమత్తమైంది. ఈరోజు, రేపు ఎండలు దంచికొట్టనున్నాయని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అవసరమైతే తప్ప బయటికి రాకూడదని హెచ్చరించింది. ఎండ తీవ్రత పెరుగుతున్నందున తెలుగు రాష్ట్రాల్లో భారీగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని సూచించింది. ముఖ్యంగా తెలంగాణలో 41 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 43 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఇక ఏపీలో ఎక్కువగా వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుత ఉష్ణోగ్రతల కంటే 2 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు వెల్లడించింది.
ఎండలు మండిపోతున్న నేపథ్యంలో పలు సూచనలు చేస్తున్నారు వైద్యులు. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున ఎక్కువగా ఎండలో తిరుగరాదని సూచిస్తున్నారు. శరీరం అలసిపోకుండా ఉండాలంటే.. గంటగంటకు లీటర్ నీళ్లు తాగాలని అంటున్నారు. అలాగే కొబ్బరి బొండం, పుచ్చకాయ, పండ్ల రాసాలు తీసుకుంటే.. కాస్త శక్తివంతంగా ఉండవచ్చు అంటున్నారు. వేసవికాలం పలుచటి దుస్తులతో పాటు.. లైట్ కలర్ దుస్తులు ధరించాలని అంటున్నారు. లైట్ కలర్ దుస్తులకు ఉష్ణాన్ని శోషించుకునే గుణం తక్కువగా ఉంటుందని.. అందువల్ల వేడిని ఎక్కువగా శోషించుకోదని తెలిపారు. అలాగే.. ఎండలో వెళ్ళినపుడు గొడుగు ధరించడం మంచిదని సూచించారు.