కేంద్ర మంత్రి పదవి లభించడం పట్ల బీజేపీ ఎంపీ బండి సంజయ్ స్పందించారు. చాలా ఆనందంగా ఉందని, తనపై నమ్మకం ఉంచి కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, జాతీయ నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనకు లభించిన మంత్రి పదవి కార్యకర్తల కృషి ఫలితమేనని, వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ముఖ్యంగా తనపై నమ్మకం ఉంచి రెండోసారి భారీ మెజారిటీతో గెలిపించిన కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల వల్లే కేంద్ర మంత్రిగా పనిచేసే అవకాశం లభించిందని బండి సంజయ్ అన్నారు. ఎప్పటికీ కరీంనగర్ ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. మంత్రిగా వచ్చిన అవకాశాన్ని రాష్ట్ర ప్రగతి కోసం, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం వినియోగిస్తానన్నారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు అనంతరం వ్యక్తిగత ఆరోపణలు, విమర్శలను పక్కనపెట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలని ఈ సందర్భంగా కోరుతున్నానన్నారు. కేంద్ర మంత్రిగా రాష్ట్రాభివృద్ధి కోసం పూర్తిస్థాయిలో సహాయ సహకా రాలందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. అలాగే తెలంగాణ ప్రజలు బీజేపీపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు. కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు.


