స్వతంత్ర, వెబ్ డెస్క్: ఏపీలో దళిత మహిళలపై అఘాయిత్యాలకు అడ్డుఅదుపులేకుండా పోయిందని మండిపడ్డారు మాజీ మంత్రి పీతల సజాత. రక్షణ కల్పించాల్సిన అధికార పార్టీ నేతలే దళిత స్త్రీలను హత్య చేయడం దుర్మార్గమని అన్నారు. ప్రకాశం జిల్లా, టంగుటూరు మండలం, రావివారిపాలెంలో దళిత స్త్రీ హనుమాయమ్మను వైసీపీ నాయకుడు ట్రాక్టర్ తో తొక్కించి చంపడం దారుణమని తెలిపారు. గతంలో గుంటూరు జిల్లా, నకిరేకల్లు మండలం, శివాపురం తండాకు చెందిన మంత్రూబాయి అనే గిరిజన మహిళను శ్రీనివాసరెడ్డి ట్రాక్టర్ తో తొక్కించి అతిదారుణంగా హత్య చేశాడు. ఇప్పుడు అదే తరహాలో హత్యగావించడం వైసీపీ గూండాల సైకోయిజానికి నిదర్శనమని అన్నారు. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే నని ఆరోపించారు.
వైసీపీ నాయకులకు దళిత మహిళలంటే ఎటువంటి భావన ఉందో ఈ సంఘటనతో బహిర్గతమైందన్నారు. జగన్మోహన్ రెడ్డికి దళితులు అంటే చిన్నచూపు. అందుకే వైసీపీ చిల్లర గ్యాంగ్ దళిత స్త్రీలపై పేట్రేగిపోతోందని వాపోయారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను టార్గెట్ చేసి హత్యలు చేయడం రాజారెడ్డి రాజ్యాంగానికి నిదర్శనమని అన్నారు. దళిత అంగన్ వాడీ టీచర్ హనుమాయమ్మ హత్యపై వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నామన్నారు. దళిత మహిళలపై జరుగుతున్న దారుణాలను వెంటనే నిలుపుదల చేయాలి… అలాగే హంతకుడైన కొండలరావుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


