నేడు పులివెందులలో ఏపీ సీఎం జగన్ పర్యటిస్టున్నారు. పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నారు. మొత్తం 841 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. మెడికల్ కాలేజి, ప్రభుత్వాస్పత్రులను ప్రారంభించారు. అనంతరం జగన్ ఇడుపులపాయకు వెళ్తారు. పులివెందుల సిగలో మరో కలికితురాయి వచ్చి చేరింది. 861.84 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను జాతికి అంకితం చేయనున్నారు సీఎం జగన్. ఓవైపు జిల్లా కేంద్రమైన కడపను మెడికల్ హబ్గా తీర్చిదిద్దారు. అత్యాధునిక వైద్య సేవలకు నిలయంగా నెలకొల్పారు. సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చారు. 500కోట్లతో ప్రభుత్వ మెడికల్ కళాశాలను నిర్మించారు.
2019 డిసెంబర్ 26న పులివెందులలో మెడికల్ కళాశాల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు.తర్వాత రెండేళ్లు కోవిడ్ వైరస్ కారణంగా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. 50 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన డాక్టర్ వైఎస్సార్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 627 పడకల వసతి గల ఆస్పత్రి, ఏడాదికి 150 మెడికల్ సీట్లు, 60 నర్సింగ్ సీట్లల్లో విద్యార్థులు విద్యను అభ్యసించేలా నెలకొల్పారు. జీ ఫ్లస్ 3గా నిర్మించిన ఈ భవనాలు ఒక్కొక్క ఫ్లోర్ 37 వేల 300 చదరపు అడుగులతో చేపట్టారు.
పులివెందుల కేంద్రంగా నూతనంగా నిర్మించిన ఆదిత్య బిర్లా గార్మెంట్స్ యూనిట్ను సైతం సీఎం జగన్ ప్రారంభించనున్నారు. 16 ఎకరాల విస్తీర్ణంలో రూ.175 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ సంస్థ నిర్మాణానికి 2021 డిసెంబర్ 24న శంకుస్థాపన చేశారు. ఉత్పత్తి ఆధారిత ప్రయోజనాల పథకంలో భాగంగా ఆదిత్య బిర్లా గ్రూప్ టెక్స్టైల్స్, బ్రాండెడ్ గార్మెంట్స్ తయారీ యూనిట్ను నెలకొల్పింది. ఏటా 24లక్షల గార్మెంట్స్ తయారీ సామర్థంతో నెలకొల్పిన ఈ యూనిట్లో 2100 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ ఉపాధి కల్పించేలా తీర్చిదిద్దారు. తొలిదశగా 500మందికి ఉద్యోగాలు కల్పించారు. ఇడుపులపాయ కేంద్రంగా 39.13 కోట్లతో నిర్మించిన డాక్టర్ వైఎస్సార్ మెమోరియల్ పార్క్ను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించనున్నారు.