ఏపీ సీఎం చంద్రబాబు కాసేపట్లో హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్కు రానున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు ఎన్టీఆర్ భవన్కు రావడం ఇది రెండోసారి. ఇటీవల అమరావతిలో జరిగిన టీడీపీ పొలిట్బ్యూరో సమావేశంలో సీఎం చంద్రబాబు తెలంగాణలో టీడీపీ బలోపేతంపై చర్చించారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు తెలంగాణ నేతలు, కార్యకర్తలతో సమావేశమై రాష్ట్రంలో టీడీపీ బలోపేతంపై చర్చించనున్నట్లు సమాచారం.
తెలంగాణలో పది శాతం ఓటు బ్యాంకు ఉందని టీడీపీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా సభ్యత్వ నమోదు, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ, బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు వేయడంపై నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది. అలాగే టీటీడీపీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై అభిప్రాయం సేకరించనున్నట్లు సమాచారం. ఈసారి అధ్యక్ష బాధ్యతలు యువకులకు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.


