ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొందని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని.. 2014- 19 మధ్య రాష్ట్ర అభివృద్ధి దిశగా వేగంగా అడుగులు పడ్డాయన్నారు. 2014-19 మధ్య భారీగా పెట్టుబడులను ఆకర్షించగలిగిందని తెలిపారు. పోలవరాన్ని 75 శాతానికి పైగా పూర్తి చేశామని.. అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్న సమయంలో 2019లో అధికార మార్పిడి జరిగిందని గవర్నర్ పేర్కొన్నారు. గత ప్రభుత్వం కారణంగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ సమయంలో ప్రజల స్వేచ్ఛను లాగేసుకున్నారన్న ఆయన గత ప్రభుత్వ హయాంలో పెట్టుబడులు ఆగిపోయాయని.. సంస్థలు తరలిపోయాయని గవర్నర్ అబ్దుల్ నజీర్ తన ప్రసంగంలో ప్రస్తావించారు.
ఇక ప్రాజెక్టులపై మూలధన వ్యయం 56 శాతం తగ్గించారని గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. అమరావతి కలను చెదరగొట్టడానికి డీసెంట్రలైజేషన్ పేరుతో మూడు రాజధానులన్నారని.. గత ఐదేళ్లలో ఏపీలో వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని.. శ్వేతపత్రాలతో ఏపీకి జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరిస్తున్నామన్నారు. రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం ప్రాజెక్ట్కు తీవ్రనష్టం చేశారని తెలిపారు. మూడు రాజధానుల పేరుతో ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని… 2018 నాటికి ఇంధన మిగులు రాష్ట్రంగా ఏపీ మారిందన్నారు. 2019-24 మధ్య ఏపీ ఇంధన రంగానికి లక్షా 29వేల 503 కోట్ల నష్టం జరిగిందని.. ఇసుక, ఖనిజ సంపదను కొల్లగొట్టడం ద్వారా 19వేల కోట్లనష్టం వచ్చినట్లు తెలిపారు. అస్తవ్యస్త ఇసుక విధానంతో 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారన్నారు.
గత ప్రభుత్వ హయాంలో ఏపీకి నాణ్యత లేని మద్యం, గుర్తింపులేని బ్రాండ్లు తీసుకొచ్చారన్నారు గవర్నర్. రాష్ట్ర ఎక్సైజ్ ఆదాయానికి భారీ నష్టం తీసుకొచ్చారన్నారు. వైసీపీ ప్రభుత్వం కారణంగా రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని తెలిపారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలును ప్రారంభించామన్నారు. సూపర్సిక్స్ వాగ్దానాలకు కట్టుబడి ఉన్నామని.. 16వేల 347 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి మెగా డీఎస్సీ ప్రకటించామని.. ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేశామని.. సామాజిక భద్రత పెన్షన్లను 4వేలకు పెంచామన్నారు. రాష్ట్ర పరిస్థితిని అర్థం చేసుకుని రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలు సహకరించాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ వెల్లడించారు.