స్వతంత్ర వెబ్ డెస్క్: ప్రయాణికుల కోసం టీఎస్ఆర్టీసీ అనేక సదుపాయాలు కల్పిస్తోంది. ఇప్పటికే స్లీపర్ బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులను కొత్తగా తీసుకొచ్చింది. అలాగే ప్రయాణికులు తాము వెళ్లాల్సిన బస్సు ఎక్కడ ఉందనేది తెలుసుకునేందుకు వీలుగా టీఎస్ఆర్టీసీ గమ్యం పేరుతో బస్సు ట్రాకింగ్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇలా ప్రయాణికులను ఆకట్టుకునేందుకు కొత్త సౌకర్యాలు కల్పిస్తున్న టీఎస్ఆర్టీసీ.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్న్యూస్ తెలిపింది. టీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ వైఫై సౌకర్యం కల్పిస్తోంది. ప్రస్తుతం కొన్ని బస్సుల్లో ఉచితంగా వైఫై సదుపాయం కల్పిస్తుండగా.. త్వరలో అన్ని బస్సుల్లోనూ ప్రవేశపెట్టనున్నారు. తొలుత 16 ఏసీ స్లీపర్ బస్సుల్లో వైఫై సదుపాయం కల్పించారు. కొద్దిరోజుల క్రితం ఈ ఏసీ స్లీపర్ బస్సులను టీఎస్ఆర్టీసీ ప్రవేశపెట్టింది. తిరుపతి, బెంగళూరు, విశాఖపట్నం, చెన్నై, హుబ్లీ లాంటి ప్రాంతాలకు ఈ బస్సులను తిప్పుతోంది. ఈ బస్సుల్లో అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. సీసీ కెమెరాలతో పాటు పానిక్ బటన్ను ఏర్పాటు చేశారు. పానిక్ బటన్ ద్వారా ప్రయాణికులు తమ సమస్యలను నేరుగా ఆర్టీసీ కంట్రోల్ రూమ్కి చెప్పుకోవచ్చు.
ఇప్పుడు కొత్త వైఫై సేవలను కూడా టీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. అలాగే స్లీపర్ బస్సుల్లో రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా కూడా ఉంటుంది. దీని ద్వారా వెనక నుంచి వచ్చే వాహనాలను కూడా పరిశీలించవచ్చు. ప్రమాదాల నియంత్రణకు ఇది ఉపయోగపడనుంది. స్లీపర్ బస్సుల్లో 15 లోయర్, 15 అప్పర్ బెర్త్లు ఉంటాయి. ఈ బస్సులు 12 మీటర్ల పొడవు ఉంటాయి.