స్వతంత్ర వెబ్ డెస్క్: విశాఖలో బీజేపీ నిర్వహిస్తున్న ‘మహాజన సంపర్క్ అభియాన్’ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. శనివారం నాడు తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గంలోని శ్రీకాళహస్తిలో జరిగిన మహాజన సంపర్క్ అభియాన్ కార్యక్రమానికి ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాగా.. రెండో సభ బీజేపీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలో నిర్వహిస్తోంది. ఈ సభకు అమిత్ షా హాజరయ్యారు.
ఇక అల్లూరు సీతారామరాజు, విజయనగర రాజులను స్మరిస్తూ ప్రసంగాన్ని ప్రారంభించిన అమిత్ షా. యూపీఏ పాలనలో 12 లక్షల కోట్ల అవినీతి జరిగిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. మోదీ 9 ఏళ్ల పాలనలో ఒక్క అవినీతి ఆరోపణలు కూడా రాలేదన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీ తీవ్రంగా నష్టపోయిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఏపీలో జగన్ పాలనలో అవినీతి తప్ప మరేమీ లేదని ఆరోపించారు అమిత్ షా. ప్రధాని మోదీ 9 పాలనలో ఒక్క అవినీతి ఆరోపణా లేదన్నారు. మోదీ ప్రధానమంత్రి అయ్యాక భారత సైన్యం బలం మరింత పెరిగిందన్నారు అమిత్ షా. పాక్లోకి చొరబడి మరీ శత్రువులకు సమాధానం ఇచ్చామని గుర్తు చేశారు. ప్రధాని మోదీ తన చాణక్యంతో ప్రపంచం ముందు భారత్ గౌరవాన్ని పెంచారన్నారు. ప్రపంచమంతా మోదీ జపం చేస్తోందన్నారు. సీఎం జగన్ తనది రైతుల సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకుంటారు. రైతుల ఆత్మహత్యల్లో ఏపీది దేశంలో మూడోస్థానం అని పేర్కొన్నారు అమిత్ షా. రైతు ఆత్మహత్యల విషయంలో సీఎం జగన్ సిగ్గుపడాలని వ్యాఖ్యానించారు. కేంద్రం ఇస్తున్న డబ్బులను రైతు భరోసా పేరుతో ఇక్కడ ఇస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు అమిత్ షా. కేంద్రం ఇస్తున్న ఇళ్ళను తమ పథకంగా చెప్పుకొంటున్నారన్నారు. రేషన్ బియ్యం మోదీ ఇస్తుంటే.. జగన్ తన బొమ్మ వేసుకుంటున్నారని దుయ్యబట్టారు. పంటలకు మద్దతు ధర కూడా పెంచామన్నారు అమిత్ షా.