స్వతంత్ర వెబ్ డెస్క్: క్లిష్టమైన వాతవరణ పరిస్థితుల నేపథ్యంలో నిలిచిన అమర్ నాథ్ యాత్ర ఆదివారం ఉదయం తిరిగి ప్రారంభమైంది. వాతావరణం అనుకూలించడంతో ఆదివారం మధ్యాహ్నం యాత్రను పునః ప్రారంభించారు. అయితే, కేవలం పహల్గామ్ మార్గంలో మాత్రమే యాత్ర మొదలైంది. జమ్మూ-కశ్మీర్లోని పంజ్తర్ణి, శేష్నాగ్ క్యాంపుల నుంచి యాత్రికులు బయల్దేరారు. పంజ్తర్ణిలో దాదాపు 1500 మంది చిక్కుకుపోగా.. వీరిలో దాదాపు 200 మంది తెలుగువారు ఉన్నారు. అమర్నాథ్ ఆలయం వద్ద వాతావరణం సానుకూలంగా మారిన వెంటనే అధికారులు గేట్లను తెరిచి భక్తులు హిమలింగానికి పూజలు చేసేందుకు అనుమతించారు.
ఇప్పటికే దర్శనం చేసుకొన్న భక్తులను బల్తాల్ బేస్ క్యాంపునకు చేరుకొనేందుకు అనుమతిస్తామని అధికారులు వెల్లడించారు. మరోవైపు అనంతనాగ్లో సైన్యం తమ క్వాజిగుండ బేస్క్యాంప్లో 700 మంది యాత్రికులకు ఆశ్రయం కల్పించింది. భారీ వర్షాల కారణంగా వారి యాత్ర నిలిచిపోయింది. బల్తాల్ మార్గంలో పరిస్థితులు ఇంకా మెరుగుపడకపోవడం వల్ల యాత్రను ఇంకా ప్రారంభించలేదు. గత శుక్రవారం నుంచి మూడు రోజులుగా యాత్ర నిలిచిపోయింది. అయినా.. చాలా మంది భక్తులు అమరలింగేశ్వరుడిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో యాత్రకు తరలి వస్తూనే ఉన్నారు.
మరోవైపు జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి మూతపడింది. దీంతో జమ్మూ నుంచి కొత్తగా యాత్రికులను మాత్రం ముందుకు అనుమతించడంలేదు. ఈ జాతీయ రహదారిపై పలు చోట్ల కొండచరియలు విరిగి పడటంతో పునరుద్ధరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా రామ్బన్ జిల్లాలో దాదాపు 40 అడుగుల మేర రోడ్డు పూర్తిగా దెబ్బతింది. దీంతో 3,500 వాహనాలు చిక్కుకుపోయాయి.