ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్లు అందని ద్రాక్షగా మిగిలిపోతున్నాయి. ప్రభు త్వాలు మారినా తీరు మారడం లేదని ఆవేదన చెందుతున్నారు ఆర్టీసీ పదవి విరమణ ఉద్యోగస్తులు. నష్టాల వల్ల నిధులు లేవన్న కారణంతో తమకు అందాల్సిన గ్రాట్యూటీ నిలిచిపోవడంపై ఆందోళన చెందుతున్నారు.
గతంలో పదవీవిరమణ పొందిన ఉద్యోగులకు వీడ్కోలు కార్యక్రమంలోనే సత్కారాలు, సన్మానాలతోపాటు వారికి రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్లలో కొన్నింటిని అదేరోజు చెల్లించి దర్జాగా సాగనంపేవారు. కానీ ఇప్పుడా ఆనవాయితీ కొనసాగడం లేదు. పూలమాలలు, బొకేలు ఇచ్చి వీడ్కోలు చెప్పేస్తున్నారు తప్ప పదవీ విరమణ ఆర్థిక ప్రయో జనాలను పక్కన పెడుతున్నారని ఆవేదన చెందుతున్నారు రిటైర్డ్ ఎంప్లా యిస్. గతంలో పదవీవిరమణ పొందిన కొద్ది రోజుల్లోనే గ్రాట్యుటీ మొత్తం చెల్లించే పద్ధతి ఉండేది. కానీ, ఇప్పుడు నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తోందని వాపోతున్నారు.ఈ సంవత్సరం జనవరి వరకు వెంటవెంటనే గ్రాట్యుటీ చెల్లించినా, ఆ తర్వాత ఫిబ్రవరి నుంచి బ్రేక్ పడింది. ఆ నెలలో రిటైర్ అయిన వారికి నెల ఆలస్యంగా చెల్లించారు. మార్చిలో రిటైర్ అయిన వారికి మూడు రోజుల క్రితం చెల్లించారు. ఇక ఏప్రిల్ నుంచి పదవీ విరమణ పొందుతున్నవారు ఎదురుచూపుల జాబితాలో ఉన్నారు. వీరికి ఎప్పుడు చెల్లిస్తారో స్పష్టత లేదు.
ఆర్టీసీలో పదవీ విరమణ పొందిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్గా వచ్చే వాటిల్లో ఇదే పెద్ద మొత్తం. దీని ఆధారంగా భవిష్యత్ కార్యాచరణకు ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఉంటారు. కానీ, ఆ మొత్తం చేతికంద టంలో జరుగుతున్న జాప్యం ఆర్టీసీ కార్మికుల్లో గందరగోళానికి కారణమవుతోంది. డ్రైవర్, కండక్టర్ లాంటి వారికి దాదాపు 10 లక్షల నుంచి 15 లక్షల వరకు ఈ మొత్తం అందాల్సి ఉంటుంది. ఈడీ లాంటి పెద్ద పోస్టులోని అధికారులకు 60 లక్షల వరకు చెల్లించాల్సి ఉంటుంది. చిరుద్యోగులుగా ఉండి రిటైర్ అయినవారు ఇప్పుడు ప్రత్యామ్నాయ నిధి లేక ఈ మొత్తంపైనే ఆశలు పెట్టుకున్నారు. దాదాపు ఐదొందల కుటుంబాలు ఇప్పుడు ఆ మొత్తం కోసం ఎదురుచూస్తున్నాయి. ఆర్టీసీలో 2013 వేతన సవరణను 2015లో అమలు చేశారు. రెండేళ్ల బకాయిల్లో 50 శాతం మొత్తాన్ని బాండ్ల రూపంలో చెల్లించాల్సి ఉంది. సర్వీసు ఉద్యోగులకు పెండింగ్లో పెట్టినా, రిటైర్ అయిన వారికి వెంటనే చెల్లిస్తూ వస్తున్నారు. కానీ జనవరి నుంచి రిటైర్ అయిన వారికి కూడా చెల్లించటం నిలిపేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో అందరు ఉద్యోగులకు బాండ్ బకాయిలు చెల్లించనున్నట్టు మూడునెలల క్రితం సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.కానీ, కొన్ని నిధులే విడుదల కావటంతో ఇటీవల కేవలం డ్రైవర్లకు చెల్లించి వదిలేశారు. జనవరి నుంచి రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లింపులు మాత్రం పునరుద్ధరించలేదు. ఒక్కో ఉద్యోగికి దాదాపు లక్షన్నర వరకు అందాల్సిఉంది. దాదాపు 1500 రిటైర్డ్ ఉద్యోగుల కుటుంబాలు ఈ నిధుల కోసం ఎదురు చూస్తున్నాయి.